నేపాల్ భూకంపం: విమానాలు దిగే దారేది? 5 రోజుల తర్వాత బతికిన బాలుడు
ఖాట్మాండ్: నేపాల్లో సహాయక చర్యలు అందించేందుకు, భూకంప బాధితులకు అవసరమైన సామాగ్రి ఇవ్వడానికి ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుండి విమానాలు వెల్లువెత్తుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లను నిలిపేందుకు రన్ వే సరిపోవడం లేదు. సమయాన్ని ఆదా చేయడానికి పలు సందర్భాల్లో సహాయక సామాగ్రిని రన్ వే మీదే పడవేస్తున్నారు.
బాధితులను రక్షించేందుకు వినియోగించే హెలికాప్టర్లకు ఈ విమానాశ్రయమే ఉంది. భూకంపం వచ్చిన అయిదు రోజుల తర్వాత నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విదేశాల నుంచి నేపాల్కు సాయం వెల్లువెత్తుతున్నా అది భూకంప బాధితులకు చేరలోకపోవడం బాధాకరం. నేపాల్లో అధికశాతం పట్టణాలు, గ్రామాలు పర్యతాల నడుమే ఉంటాయి.
భూకంప తాకిడికి కొండచరియలు విరిగిపడటం, రహదారులు ధ్వంసం కావడంతో చాలా పట్టణాలు, గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయాయి. స్థానికుల సహకారం లేనిదే వీటిని గుర్తించడం కానీ చేరుకోవడం కానీ సహాయ బృందాలకు వీలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో విదేశీ బృందాలు ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఖాట్మండుకే పరిమితమవుతున్నాయి.
చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే సహాయ బృందాలు గ్రామాల్లో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు భారీ ఎత్తున సహాయ సామాగ్రితో వస్తున్న విమానాలు దిగేందుకు సైతం ఖాట్మండు విమానాశ్రయంలో చోటు కరవైంది. కాగా, మృతుల సంఖ్య ఆరువేల పైకి చేరింది.
ఐదు రోజుల తర్వాత బతికిన చిన్నారి
ఐదు రోజుల క్రితం నేపాల్లో సంభవించిన భూకంపం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ మంది శిథిలాల కింద నలిగి చనిపోయారు. గురువారం హిల్స్టన్ గెస్ట్హౌస్ శిథిలాలు తొలగిస్తుండగా మట్టిలో కూరుకుపోయి శరీరం సహకరించని స్థితిలో 15 ఏళ్ల ఓ బాలుడు పడి ఉన్నాడు.
అతడు చనిపోయి ఉంటాడని అనుకున్న రెస్క్యూ సిబ్బంది నెమ్మదిగా పైకి లాగారు. అయితే ఆ బాలుడు బతికే ఉండడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అధికారులు ప్రకటించారు. అతడిని పెంబా లామాగా గుర్తించినట్లు చెప్పారు. లామా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరొకరిని కూడా రక్షించారు.