నేపాల్ భూకంపం: అమెరికా హెలికాప్టర్ అదృశ్యం
ఖాట్మాండ్: నేపాల్లోని భూకంప బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అమెరికా నౌకాదళ హెలికాప్టర్ ఒకటి అదృశ్యమైంది ఈ విషయాన్ని అమెరికా నౌకాదళ కెప్టెన్ క్రిస్ సిమ్స్ మంగళవారం నాడు తెలిపారు.
చారికోట్ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న తేలికపాటి స్క్వాడ్రన్ 469 రకానికి చెందిన హెలికాప్టర్ ఉన్నట్టుండి కనిపించడం లేదని చెప్పారు. ఘటన పైన దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. అదృశ్యమైన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉందన్నారు.
కాగా, అదృశ్యమైన హెలికాప్టర్లో ఇద్దరు నేపాలీ సైనికులు, ఆరుగురు అమెరికా మెరైన్ వారు ఉండవచ్చునని చెబుతున్నారు. ఇది మంగళవారం రాత్రి పది గంటల సమయంలో హఠాత్తుగా అదృశ్యమైందని చెప్పారు.
ఇదిలా ఉండగా, సహాయక బృందాలను పంపించాలని నేపాల్ ప్రభుత్వం కోరేవరకూ ఎదురుచూడాలని భారత్ నిర్ణయించింది. నేపాల్లో మంగళవారం తాజాగా సంభవించిన భూకంపంతో స్థానిక యంత్రాంగానికి సహాయపడేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది.
అయితే, నేపాల్ కోరేవరకూ ఎదురుచూడాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. గత నెల 25న సంభవించిన భూకంపం అనంతరం పది రోజుల తర్వాత భారత్తో సహా విదేశాలకు చెందిన అన్ని సహాయక బృందాలు వెళ్లిపోవాలని నేపాల్ కోరిన విషయం విదితమే.
ఈ పరిణామం నేపథ్యంలో మంగళవారం నేపాల్లో తాజాగా భూకంపం సంభవించింది. ఏ క్షణమైనా సహాయ బృందాలను నేపాల్కు పంపేలా సన్నద్ధం చేశారు. అయితే నేపాల్ కోరిన అనంతరమే పంపాలని నిర్ణయించారు. నేపాల్ నుంచి ఏ క్షణమైనా అత్యవసర పిలుపు వచ్చే అవకాశం ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళాలను సిద్ధంగా ఉంచారు.