నేపాల్లో మళ్లీ భూకంపం: అమెరికా హెలికాప్టర్ శకలాల గుర్తింపు
ఖాట్మాండ్: నేపాల్లో శుక్రవారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఖాట్మాండ్కు 52 కి.మీ దూరంలోని ధాడింగ్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనల ధాటికి నేపాల్ వాసులు భయాందోళనకు గురయ్యారు.
ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం వల్ల భారీ ఆస్తినష్టంతో పాటు ఎనిమిది వేల మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో నేపాల్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నారు.
అమెరికా హెలికాప్టర్ శకలాల గుర్తింపు
నేపాల్లో కనిపించకుండా పోయిన అమెరికా హెలికాప్టర్ శకలాలను నేపాల్ సైన్యం గుర్తించింది. భూకంప బాధితుల కోసం సహాయకచర్యల్లో పాల్గొంటున్న అమెరికా హెలికాప్టర్ ఎనిమిది మందితో మంగళవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.
చైనా సరిహద్దులో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు నేపాల్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. శకలాలను ఆకాశంపై నుంచి గుర్తించామని చెప్పారు. హెలికాప్టర్ శిథిలాలు ఉన్న ప్రదేశంలో మూడు మృతదేహాలను కూడా గుర్తించామని, అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
యూఎస్ మెరైన్ కార్ప్స్కి చెందిన ఆరుగురు సిబ్బంది, ఇద్దరు నేపాల్ సైనికులతో బాధితులకు సహాయక సామాగ్రి చేరవేయడానికి వెళ్తున్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.