భారత్కు మూడు వైపులా ముప్పే: పాక్..చైనా..మధ్యలో నేపాల్: కొత్త మ్యాప్ ఏకగ్రీవంగా
ఖాట్మండు: ఇన్నాళ్లూ భారత్కు మిత్రదేశంగా వ్యవహరిస్తూ వచ్చిన హిమాలయన్ కంట్రీ నేపాల్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత భూభాగంతో కూడిన కొత్త మ్యాప్ను ఆమోదించింది. నేపాల్ ఎగువ సభ ఆమోదం పొందింది ఈ మ్యాప్. ఫలితంగా- నేపాల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఉత్తరాఖండ్ పరిధిలోని లిపులేఖ్ పాస్లో కొంత భూభాగం ఆ దేశానికి చెందినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ మేరకు సవరణలతో కూడిన కొత్త మ్యాప్ బిల్లును ఎగువసభ ఆమోదించింది. దీనితో అది చట్ట రూపం దాల్చింది. దీనిపై రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.
57:0 ఓట్లతో
భారత భూ భాగంపై ఉన్న లిపులేఖ్ ఒక్కటే కాదు.. కాలాపానీ, లిపులేఖ్, లింపుయాధురాలను కూడా నేపాల్ ఈ మ్యాప్లోకి చేర్చింది. ఈ మూడు ప్రాంతాలు కూడా తమ దేశానికి చెందినవని ప్రకటించింది. కొద్దిరోజుల కిందటే ఈ కొత్త మ్యాప్ను నేపాల్ దిగువసభ ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బిల్లు ఎగువసభ సమక్షానికి వచ్చింది. మ్యాప్లో సవరణలను చేస్తూ ప్రతిపాదించిన
ది న్యూ మ్యాప్ అమెండ్మెంట్ బిల్ (కోట్ అండ్ ఆర్మ్స్)పై ఓటింగ్ నిర్వహించారు. 57:0 ఓట్ల తేడాతో ఈ బిల్లు సభామోదం పొందింది. ఎగువ సభ సభ్యులందరూ మ్యాప్కు అనుకూలంగా ఓటు వేశారు.
మూడు వైపులా ముప్పులా
ఇక ఈ బిల్లుపై నేపాల్ రాష్ట్రపతి ఆమోదించడం ఒక్కటే మిగిలింది. అది లాంఛప్రాయమే అవుతుందని అంటున్నారు. ఇప్పటికే చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటోన్న భారత్కు ఇక కొత్తగా నేపాల్ కూడా జత కావడం ఆందోళన కలిగిస్తోంది. జమ్మూ కాశ్మీర్ వైపున పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు, ఉగ్రవాద సమస్యను భారత్ ఎదుర్కొంటోంది. మరోవంక లఢక్ వైపున చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించకోవడంలో తలమునకలైంది. అదే సమయంలో నేపాల్ వైపు నుంచి కూడా సరిహద్దు వివాదం కొత్తగా తోడు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సందట్లో సడేమియాలా
లఢక్ సమీపంలో భారత్ చైనాలను విడదీసే వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే సందట్లో సడేమియా అన్నట్లుగా నేపాల్ కొత్త మ్యాప్ను రూపొందించుకోవడం.. దాన్ని జాతీయ అసెంబ్లీలో ఆమోదింపజేసేకోవడాన్ని బట్టి చూస్తోంటే.. ఈ విషయంలో ఆ దేశం ఎంత దూకుడుగా వ్యవహరించిందనేది అర్థం చేసుకోవచ్చు. కాలాపానీ, లిపులేఖ్, లింపుయాథుర ప్రాంతాలను తమదేశ మ్యాప్లో చేర్చే విషయంలో నేపాల్.. భారత్తో ఎలాంటి చర్చలకు కూడా ఉపక్రమించలేదు. ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీని వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
Recommended Video
తెరవెనుక చైనా..
భారత్, నేపాల్, చైనాల మధ్య ట్రైజంక్షన్లా కనిపించే ఈ లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు రక్షణపరంగా మూడు దేశాలకూ వ్యూహాత్మకమైనవే.. సున్నితమైనవే. చైనాకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ కొత్త మ్యాప్లో లిపులేఖ్ వంటి కీలకమైన ప్రాంతాన్ని చేర్చడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. భారత్కు మరిన్ని సరిహద్దు సమస్యలను సృష్టించాలనే ఉద్దేశంతోనే చైనా తెర వెనుక ఉండి నేపాల్ నడిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొత్త మ్యాప్ను నేపాల్ ఎగువసభ ఆమోదించడం పట్ల భారత్ ఇంకా తన స్పందన ఏమిటనేది వెల్లడించాల్సి ఉంది.