50మంది మృతి: నేపాల్ విమాన ప్రమాదానికి కన్ఫ్యూజనే కారణమా?
ఖాఠ్మాండ్: సోమవారంనాడు నేపాల్ రాజధాని ఖాఠ్మాండ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ల్యాండింగ్ సమయంలో పైలట్కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు మధ్య జరిగిన సంభాషణలో గందరగోళం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
నేపాల్లో కుప్పకూలిన విమానం: 50 మంది సజీవ దహనం
71 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యూఎస్-బంగ్లా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఖాఠ్మాండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ అదుపుతప్పి భూమిని ఢీకొట్టింది.
సూచనల్లో గందరగోళం
విమానం దిగడానికి తక్కువ ఎత్తులో ఉన్న సమయంలో ల్యాండింగ్ సూచనల్లో గందరగోళం నెలకొందని, ఒక్కసారిగా భూమికి తగిలి మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు.
ల్యాండింగ్లో కోసం తికమక
మొదట ఉత్తరం వైపు ల్యాండింగ్ కోసం పైలట్ అనుమతి కోరగా ఏటీసీ అంగీకరించింది. అయితే ఒక నిమిషం లోపే మళ్లీ పైలట్ తాను దక్షిణంపైపు దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దక్షిణం వైపు ల్యాండింగ్కు క్లియర్ చేస్తున్నట్లు ఏటీసీ చెప్పినట్లు రికార్డింగ్లో ఉందని ఓ వెబ్సైట్ కథనం పేర్కొంది. కాగా, దక్షిణం వైపు ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఉత్తరం వైపు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
భయపడినట్లే..
ల్యాండింగ్కు ముందు పైలట్ ‘మేము ల్యాండ్ అవ్వొచ్చా?' అని అడిగినట్లు ఓ నేపాలీ చెప్పారు. చివరలో ట్రాఫిక్ కంట్రోలర్ భయంతో మాట్లాడినట్లు అనిపించిందని, పైలట్తో ‘ఐ సే అగైన్.. టర్న్' అని అన్నారని, ఆ తర్వాత వెంటనే కంట్రోలర్ అగ్నిమాపక సిబ్బందిని రన్వే పైకి వెళ్లమని ఆదేశించిందని చెప్పారు. విమానం దిగడానికి ముందు పలుమార్లు దిశ మార్చుకునే ప్రయత్నం చేసిందని మరో వ్యక్తి వెల్లడించారు.
భూమిని తాకగానే పేలుళ్లు..
కాగా, ల్యాండవుతూ విమానం భూమిని తాకగానే వరుసగా రెండు పేలుళ్లు వినిపించాయని కూలిన విమానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఒకరు తెలిపారు. నిమిషాల్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పారు. ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం విమానం త్రిభువన్ విమానాశ్రయం చుట్టూ రెండు రౌండ్లు వేసిందని ఖాఠ్మాండ్ విమానయాన సంస్థ మేనేజర్ తెలపడం గమనార్హం.
పైలట్ తప్పుడు నిర్ణయం వల్లే..
పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలు సరిగ్గా పాటించలేదని, విమానం తప్పుడు దిశలో రన్వే పైకి వచ్చిందని ఖాఠ్మాండ్ విమానాశ్రయం జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ ఛెత్రి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. అధికారులు విమానంలోని బ్లాక్బాక్స్ను సేకరించారు. కాగా, నేపాల్ ప్రభుత్వం.. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.