నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి షాక్: అధికార కమ్యూనిస్టు పార్టీ నుంచి తొలగింపు
ఖాట్మాండ్: నేపాల్లో రాజకీయం సంక్షోభం దిశగా సాగుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) బహిష్కరించింది. ఆ పార్టీ చీలిక వర్గానికి చెందిన కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేపీ శర్మ ఓలి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు పార్టీ నేత నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు.
అధికార కమ్యూనిస్టు పార్టీలో తన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలి అనూహ్యంగా డిసెంబర్ 20న పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి దీనిని ఆమోదించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఆ దేశ జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వరకు తాత్కాలిక ప్రధానిగా కేపీ శర్మ వ్యవహరించనున్నారు.
పార్లమెంటును రద్దు చేయడంపై అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ రెండు చీలిపోయింది. ఓ వర్గం ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ నుంచి ఓలిని బహిష్కరించాలని, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన వ్యతిరేక వర్గం భారీ ర్యాలీలు చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగిన ఓలి వ్యతిరేక కేంద్ర కమిటీ సమావేశంలో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయించారు. పార్టీలో సభ్యుడిగా కూడా కొనసాగే అర్హత ఓలికి లేదని, అందుకే పార్టీ నుంచి తొలగించినట్లు కమ్యూనిస్టు పార్టీ నేత మాధవ్ కుమార్ తెలిపారు. పార్టీ ఆయన మోకాళ్ల దగ్గర తల ఒగ్గి ఉండదని, ఎవరికీ కూడా అలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు.