హీటెక్కిన హిమాలయన్ కంట్రీ: నేపాల్లో పెను సంక్షోభం: పార్లమెంట్ రద్దు: అధ్యక్ష భవనం నిర్ణయం?
ఖాట్మండు: హిమాలయా పర్వత శ్రేణువుల మధ్య ఉండే నేపాల్లో పెను రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటిదాకా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన సంక్షోభ పరిస్థితులు ఒక్కసారిగా పేలిపోయాయి. అవి కాస్తా పార్లమెంట్ రద్దుకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి.. పార్లమెంట్ను రద్దు చేయడానికి పూనుకున్నారు. కొద్దిసేపటి కిందటే అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ను రద్దు చేయాలని సిఫారసు చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో కేపీ శర్మ ఓలి.. దేశాధినేత నివాసానికి చేరుకున్నారు.
సంక్షోభంలో నేపాల్..
కొంతకాలంగా నేపాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొంటూ వస్తోంది. ప్రత్యేకించి- నేపాల్లో అధికార పార్టీ భారత్ను కాదని.. చైనా వైపు మొగ్గు చూపడం పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో- భారత్కు చెందిన కొంత భూభాగాన్ని తమదిగా చూపిస్తూ నేపాల్ సరికొత్త భౌగోళిక మ్యాప్ను రూపొందించింది. దీనికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. అప్పటి నుంచీ.. అనిశ్చిత పరిస్థితులు తలెత్త సాగాయి. అవి మరింత ముదిరాయి. రాజకీయ సంక్షోభానికి దారి తీశాయి.
పార్లమెంట్ రద్దు చేయాలంటూ సిఫారసు..
ఈ ఉదయం నేపాల్ కేబినెట్ సమావేశమైంది. దీనికి ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వాన్ని వహించారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనేక తర్జనభర్జనల అనంతరం పార్లమెంట్ను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ను రద్దు చేయాలని తీర్మానించింది. ఈ తీర్మానంపై నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆమోదించాల్సి ఉంది. ఈ ఆమోదాన్ని తీసుకోవడానికి ప్రధాని కేపీ శర్మ ఓలీ.. కేబినెట్ తీర్మాన ప్రతులతో ఆమె కార్యాలయానికి వెళ్లారు.
పార్లమెంట్ రద్దు ఒక్కటే మార్గం..
ఈ సమావేశం సందర్భంగా మెజారిటీ మంత్రులు పార్లమెంట్ రద్దు వైపే మొగ్గు చూపారని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి బర్సమాన్పూర్ తెలిపారు. రాజ్యంగ, రాజకీయ సంక్షోభాలను నివారించడానికే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరణ ఇచ్చారు. తాము ఆమోదించిన సిఫారసులు, తీర్మానానికి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సంక్షోభాన్ని నివారించడానికి పార్లమెంట్ను రద్దు చేయడం ఒక్కటే మార్గమని తాము భావించామని అన్నారు.
తప్పు పడుతోన్న సొంత పార్టీ
కాగా- కేపీ శర్మ తీసుకున్న నిర్ణయం పట్ల సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేతలు మండిపడుతున్నారు. నేపాల్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చెల్లదని చెబుతున్నారు. మెజారిటీ మంత్రులు లేకుండానే.. దీన్ని ఆమోదించారని అంటున్నారు. కేబినెట్ చేసిన సిఫారసులకు అధ్యక్ష కార్యాలయం తిరస్కరిస్తుందని ఆశిస్తున్నట్లు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ చెప్పారు. మంత్రివర్గం సమావేశం పేరుతో.. కేపీ ఓలి.. తనకు అనుకూలమైన, తన మాట వినే మంత్రులను మాత్రమే పిలిచారని విమర్శించారు.
అత్యవసర భేటీకి పిలిపునిచ్చిన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ..
ఈ పరిణామాలతో అక్కడి రాజకీయం వేడెక్కింది. కేపీ శర్మ ఓలి పార్లమెంట్ను రద్దు చేస్తూ.. చేసిన సిఫారసులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ మధ్యాహ్నం 3 గంటకు ఈ భేటీ ఏర్పాటు కానుంది. ఆర్పీపీ ఉపాధ్యక్షుడు కమల్ థాపా ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారాన్ని పంపించారు. పార్లమెంట్ రద్దు కావడమంటూ జరిగితే.. ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరునెలల వ్యవధిలో నేపాల్లో ఎన్నికలను నిర్వహించాల్సి రావచ్చని అంటున్నారు.