నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా బిధ్యా దేవి
ఖాట్మాండ్: నేపాల్ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశ అధ్యక్ష పీఠాన్ని తొలిసారి ఓ మహిళ అధిరోహించారు. గత నెలలో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలో బిధ్యా దేవి భండారి విజయం సాధించారు.
ఇప్పటిదాకా ఆమె అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వైస్ ఛైర్ పర్సన్గా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి కుల్ బహదూర్ గురుంగ్ను ఆమె ఓడించారు. మొత్తం 327 ఓట్లకు గాను బిధ్యాకు 214 ఓట్లు వచ్చాయి.
ఈ క్రమంలో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా బిధ్యా భండారి ఎన్నికైనట్లు పార్లమెంటరీ స్పీకర్ ఒన్సారి ఘర్తీ ప్రకటించారు.
నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత బిధ్యా భండారి దేశ రెండో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అంతకుముందు దేశంలో రాజరిక పాలన కొనసాగిన విషయం తెలిసిందే. భండారి కంటే ముందు రాంభరణ్ యాదవ్ ఏడేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు.