నేపాల్ పార్లమెంట్ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం: మధ్యంతర ఎన్నికలు, ఎందుకంటే..?
కాఠ్మాండ్: నేపాల్ రాజకీయాల్లో నెలకొన్న వివాదం తారస్థాయికి చేరి ఏకంగా మధ్యంతర ఎన్నికలకే దారితీసింది. అధికార పార్టీలో తల్లెత్తిన వివాదాల నేపథ్యంలో పార్లమెంటు రద్దుకు సిఫారసు రావడం నేపాల్ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి.
నేపాల్ పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు
నేపాల్ ప్రధాన కేపీ శర్మ ఓలి నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి చేసిన సిఫారసుకు ఆ దేశ రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ ఆదివారం ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో నేపాల్లో త్వరలోనే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30, మే 10న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు.
తారస్థాయికి చేరిన విభేదాలు
అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ)లో గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాని పీఠం కోసం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని మంత్రి మండలి.. పార్లమెంటును రద్దు చేయాలంటూ మండలి అధ్యక్షురాలు, రాష్ట్రపతి విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది.
అధికార పార్టీలో రెండు వర్గాలు..
ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి మండలి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆ సిఫారసుకు ఆమోదం తెలపడంతో ఈ హిమాలయ దేశంలో ఏప్రిల్, మే నెలలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. కాగా, తాజా పరిణామాలను అధికార పార్టీలోని మరో పక్షంతోపాటు నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్టీలో తగాదాలుంటే ప్రభుత్వాన్ని పడగొడతారా? అంటూ మండిపడుతున్నాయి. అధికార పార్టీలో ఓ వర్గం ఓలీకి మద్దతిస్తుండగా.. మరో వర్గం మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండకు మద్దతుగా ఉంది.
హిమాలయ దేశంలో రాజకీయ రచ్చ
ప్రస్తుతం మనుగడలో ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు 2017లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 275 మంది సభ్యులు ఉన్నారు. కాగా, ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ ప్రచండ వర్గం గత కొంత కాలంగా కేపీ శర్మ ఓలీని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే పార్లమెంటును రద్దు చేయడం గమనార్హం. అంతేగాక, చైనాకు అనుకూలంగా ఉంటున్నాననే నెపంతో తనను ప్రధాని పదవి నుంచి తొలగించేందుకు భారత్ కుట్రలో చేస్తోందంటూ ఒలి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భారత్ అన్ని విధాలుగా నేపాల్ కు సహకరిస్తున్నా ఆయన ఇలాంటి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, ఈ మధ్యంతర ఎన్నికలు నేపాల్ దేశంలో ఏ పరిణామాలకు దారితీస్తాయో వేచిచూడాలి.