ఆన్లైన్లో నేతాజీ అంతిమ సంస్కారాల వివరాలు
లండన్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన పలు దస్త్రాలను ఆన్లైన్లో విడుదల చేశారు. తైపీలో తాన్ తీ తీ అనే అధికారి అనుమతితో నేతాజీ దహన సంస్కారాలు అక్కడే నిర్వహించినట్లు ఇందులో పొందుపరిచారు.
1945 ఆగస్టు 18న తైపీ విమానాశ్రయం పరిసరాల్లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్లుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి.. ఆయన మృతదేహం దహనసంస్కారాలు, ఆయన గడిపిన చివరి రోజులు తదితర సమాచారాన్ని యూకేకి చెందిన ఓ వెబ్సైట్ ఆన్లైన్లో పొందుపరిచింది.
ఈ సమాచారాన్నంతటినీ www.bosefiles.info అనే వెబ్సైట్లో పొందుపరిచినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. యూకే విదేశీ వ్యవహారాల కార్యాలయం ఫైల్ నెం. 1852/6, 1956 పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. 1945, ఆగస్టు 22న సుభాష్ చంద్రబోస్ అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు ఓ ఇంటర్వ్యూలో తీతీ చెప్పినట్లు పేర్కొన్నారు.
అయితే, సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతిచెందారనే విషయంపై ఇప్పటి వరకు కచ్చితమైన ఆధారాలు లేవు. నేతాజీ గురించిన విషయాలు తరచూ చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంచడం ప్రాధాన్యత సంతరించుకుంది.