నేతాజీ బంగారు పన్ను రెంకోజీ ఆలయంలోనే
టోక్యో: నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన చివరి రోజుల్లో జరిగిన కొన్ని ఘటనలను సేకరిస్తోన్న యుకే వెబ్సైట్ http://www.bosefiles.info/ తాజాగా మరికొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి బంగారు పూత పూసిన పన్ను ఉండేదని, ఇప్పుడు ఆ బంగారు పన్ను టోక్యోలోని రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలతో పాటు ఉండొచ్చని పేర్కొంది.
నేతాజీ చివరి రోజుల గురించి అనేక విషయాలను వెల్లడిస్తోన్న ఈ వెబ్సైట్ తాజా ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత నేతాజీ అంత్యక్రియలకు ముందు నేతాజీతోపాటుగా ఉన్న కల్నల్ రెహ్మాన్ నేతాజీ చితాభస్మం, అస్థికలతోపాటు ఈ బంగారు పన్నునూ కుండలో వేసినట్లు తన కొడుక్కి చెప్పారని పేర్కొంది.
అంతేకాదు కల్నల్ రెహ్మాన్ మరణానికి ముందు తన కుమారుడు నీమోర్కు పూర్తి వివరాలు వెల్లడించారని ఈ వెబ్సైట్లో పేర్కొంది. నీమోర్ తన తండ్రి చెప్పిన వివరాలను వెబ్సైట్ను నిర్వహిస్తున్న ఆశిష్ రాయ్కు తెలిపారని పేర్కొంది.
దీంతో రాయ్ ఆ వివరాలను అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతీ బసు, జనతా దళ్ అధ్యక్షుడు ఎస్ఆర్ బొమ్మయ్, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి చిత్తా బసుకు వెల్లడించారని పేర్కొంది. భారత్ ప్రభుత్వం సైతం ఇటీవల విడుదల చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ దస్త్రాల్లోనూ ఆశిష్ రాయ్ ఈ ఐదుగురికి లేఖ రాసిన విషయాన్ని వెల్లడించింది.