మోడీతో భేటీకి నేను హాజరుకాను: నేతాజీ కూతురు
లండన్: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి తాను ఉండటం లేదని స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ చెప్పారు. నేతాజీ కుటుంబ సభ్యులు సుమారు 35 మందితో అక్టోబర్ 14వ తేదీన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని అనితా బోస్ చెప్పారు.
ఆమె ప్రస్తుతం లండన్లో ఉన్నారు. నేతాజీ కుటుంబ సభ్యులు ప్రధాని మోడీతో సమావేశమై సుభాష్ చంద్రబోస్కు సంబంధించి దస్త్రాలను బహిర్గతం చేయాలని, ఆయన గురించి పూర్తి సమాచారం అందించాలని డిమాండ్ చేయనున్నారు.
అయితే ఈ సమావేశానికి అనితా బోస్, ఆమె కుమారుడు సుగతో బోస్ హాజరుకావడం లేదని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆమె సన్నిహితులు చెప్పారు. అక్టోబరు 15 తర్వాతే భారత్ రానున్నారని వెల్లడించారు. నేతాజీ కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ కృష్ణబోస్ కూడా ఈ సమావేశానికి హాజరుకావడం లేదు.
వారి కుటుంబసభ్యుల్లో ఒకరైన చంద్రబోస్ మాట్లాడుతూ... తాము ప్రధాని సమావేశానికి సంబంధించి అజెండాను ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి పంపించామన్నారు. నేతాజీకి సంబంధించి దస్త్రాలు కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద, కేంద్రం వద్ద కూడా ఉన్నాయని అన్నింటిని బహిర్గతం చేయాలని కోరనున్నట్లు చెప్పారు.