కరోనా క్వారంటైన్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు!: సహాయకుడికి పాజిటివ్
జెరూసలెం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. సామాన్యుల నుంచి దేశాధి నేతల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తచర్యలో భాగంగా నెతన్యాహూ కూడా క్వారంటైన్లోకి వెళ్లారు.
వారం రోజుల క్రితం పార్లమెంటు సమావేశాలకు హాజరైన బెంజిమన్ ప్రతిపక్ష సభ్యుల సలహాలు తీసుకుని కరోనాను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయన సహాయకుడొకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనతోపాటు మిగితా సహాయక సిబ్బంది కూడా అసోలేషన్కు వెళ్లినట్లు స్థానిక మీడియా జెరూసలెం పోస్టు వెల్లడించింది.
కాగా, బెంజిమన్ నెతన్యాహు క్వారంటైన్ కు వెళ్లారనే వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించింది. కరోనాపాజిటివ్ వచ్చిన ప్రధాని సహాయకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్లో ఇప్పటి వరకు 4347 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, 15 మంది మృతి చెందారు. 132 మంది కోలుకున్నారు.
ఇది ఇలావుండగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆ దేశ ఆర్థిక మంత్రి కూడా కరోనా బారినపడ్డారు. కెనడా ప్రధాని భార్య కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు. స్పెయిన్ యువరాణి కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో 1071 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది ప్రాణాలు కోల్పోయారని లవ్ అగర్వాల్ వెల్లడించారు. మరో 99 మంది కోలుకున్నారని తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 34,845 మరణాలు చోటు చేసుకోగా, 7,35,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.