మాట వినకుంటే తాలిబన్ చీఫ్ మార్గెట్ అవుతాడు
వాషింగ్టన్: కరుడుకట్టిన ఉగ్రవాద సంస్థ తాలిబన్ నూతన చీఫ్ గా పగ్గాలు చేపట్టిన ముల్లా హై బతుల్లా అకుంద్ జాదాకు శాంతి చర్చలలో పాల్గొనడానికి అవకాశం ఉందని అమెరికా తెలిపింది. అతను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇటీవల పాకిస్థాన్ లో తలదాచుకున్న తాలిబన్ నాయకుడు ముల్లా మన్సూర్ ను అమెరికా సైనిక దళాలు డ్రోన్ లతో అంతం చేసిన విషయం తెలిసిందే. తరువాత ఆ స్థానంలో హై బతుల్లా అకుంద్ జాదా తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు తాలిబన్లకు అతనే బాస్ .
శాంతి చర్చలకు ఆహ్వానించినందున హై బతుల్లా అకుంద్ జాదా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడని భావిస్తున్నామని అమెరికా విదేశాంగ డిప్యూటీ స్పోక్ పర్సన్ మార్క్ టోనర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. హై బతుల్లా ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద జాబితాలో లేడని ఆయన అన్నారు.
అయితే శాంతి చర్చలకు రాకుండా తాలిబన్ హింసాత్మక కార్యకలాపాలకు అతను మద్దతు ఇస్తే మాత్రం మా టార్గెట్ అతనే అని టోనర్ స్పష్టం చేశారు. చర్చల ద్వార సమస్యకు పరిష్కారం వస్తుందని, అంతే కాని హింసకు వెళితే పరిస్థితులు వేరుగా ఉంటాయని టోనర్ హెచ్చరించారు.