కయ్యాలమారి చైనా: ఇప్పుడు భూటాన్ సరిహద్దు ప్రాంతాలపై కన్నేసింది, భారత్ బుద్ధి చెప్పినా..
న్యూఢిల్లీ/బీజింగ్: కయ్యాలమారి చైనాకు ఏ దేశంతోనూ ఘర్షణకు దిగకపోతే నిద్రపట్టదేమో. ఎందుకంటే మొదట్నుంచి చైనా వ్యవహారం అలానే ఉంది. ఇప్పటి వరకు వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తలకు కారణమైన చైనా.. ఆ తర్వాత దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ పలు దేశాలతో ఘర్షణకు సిద్ధమైంది. తాజాగా ఇప్పుడు మరో పొరుగు దేశమైన భూటాన్తో కయ్యానికి కాలు దువ్వుతోంది.
Recommended Video
భూటాన్ సరిహద్దులపై చైనా కన్ను..
భూటాన్ దేశంతో ఉన్న సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డ్రాగన్ దేశం ఎత్తులు వేస్తోంది. చైనా, భూటాన్ దేశాల మధ్య ఈ అంశంపై 25వ సారి సరిహద్దు చర్చలు జరగనున్నాయి. కాగా, పీఎల్ఏ బలప్రదర్శనలతో భూటాన్ కొంత ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు సిద్ధంగా చైనా బలగాలు ఉండగా.. ఈ చర్చలు ఏమేర ఫలవంతమవుతాయనేది సందేహంగానే మారింది.
భారత్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం..
భారత్-చైనాకు మధ్యలో ఉన్న భూటాన్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, భూటాన్ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. పలుమార్లు భారత్ కూడా భూటాన్కు అండగా నిలబడింది. ఒకవేళ భూటాన్.. చైనా మంద బలానికి తలొగ్గి ఏవైనా సరిహద్దు ప్రాంతాలను ఆ దేశానికి వదిలేసినట్లయితే.. భారత్ సరిహద్దు భద్రతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుండి.
డోక్లాం విషయంలో భూటాన్కు భారత మద్దతు..
2017లో భూటాన్కు చెందిన డోక్లాం ప్లాటూను ఆక్రమించుకునేందుకు వచ్చిన చైనా బలగాలను భారత ఆర్మీ అడ్డుకుంది. సుమారు 73 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరకు చైనా బలగాలు అక్కడ్నుంచి వెనుదిరిగాయి. దీంతో భూటాన్ ఆ ప్రాంతాన్ని కాపాడుకోగలిగింది. భూటాన్కు భారత్ మద్దతుగా నిలవడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా భారత్.. భూటాన్కు మద్దతివ్వడం ఆపలేదు. మన పొరుగుదేశమైన భూటాన్తో ఉన్న స్నేహ బంధమే ఇందుకు కారణం.
కయ్యాలమారి చైనా.. గట్టిగా బుద్ధి చెప్పినా అంతే..
అయితే, భూటాన్ సరిహద్దు ప్రాంతాలను కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటున్న చైనా.. ఆ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ.. భారీగా బలగాలను మోహరిస్తోంది. భూటాన్ పశ్చిమ సరిహద్దులోని ఐదు ప్రాంతాలను ఇప్పటికే చైనా ఆక్రమించుకుందని భూటాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లోకి భూటాన్ ఆర్మీని కూడా రాకుండా అడ్డుకుంటోంది డ్రాగన్ దేశం. అంతేగాక, భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లోకి వస్తున్న చైనా బలగాలు.. భూటాన్ భద్రతా దళాలనే అడ్డుకోవడం గమనార్హం. రాజారాణి సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చైనా బలగాలకు భారత భద్రతా దళాలే జవాబు చెబుతున్నాయి. భూటాన్ దేశానికి మద్దతుగా చైనాను కట్టడి చేస్తున్నాయి. ఇక భూటాన్ కూడా తన శక్తి మేర సరిహద్దులోకి బలగాలను పంపించి చైనా సైన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.