చైనాను భయపెడుతోన్న కొత్త వైరస్: 23 ఏళ్ల విద్యార్థినిలో అలాంటి లక్షణాలు: కొత్త పేరు
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చి, ప్రపంచం మొత్తాన్ని వణికికిస్తోన్న చైనా.. ఇప్పుడు అదే రకమైన భయానికి గురవుతోంది. బెంబేలెత్తుత్తోంది. మళ్లీ లాక్డైన్ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి కారణం- బ్రిటన్లో కనిపించిన కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ తాజాగా చైనాలో ఎంట్రీ ఇవ్వడమే. ఈ కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్ తొలిసారిగా చైనాలో కనిపించింది. స్ట్రెయిన్ తొలికేసుగా చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
షాంఘైలో ఈ తొలి కేసు వెలుగులోకి వచ్చింది. 23 సంవత్సరాల విద్యార్థినిలో కరోనా వైరస్ స్ట్రెయిన్ కనిపించింది. షాంఘైకి చెందిన ఆమె.. బ్రిటన్లో చదువుకుంటున్నారు. కిందటి నెల డిసెంబర్ 24 తేదీన స్వస్థలానికి తిరిగి వెళ్లారు. అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో హోమ్ క్వారంటైన్లో గడుపుతున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అధికారులు ఆ విద్యార్థిని నమూనాలను సేకరించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ)కి తరలించారు. వాటిని పరిశీలించిన అనంతరం.. ఆమెకు కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారించారు.
దీనిపై సీడీసీ తన జర్నల్లో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. ఈ వైరస్కు కొత్త పేరు పెట్టింది. వీయూఐ202012/01గా గుర్తించినట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలన్నింటినీ మళ్లీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఇందులో పేర్కొంది. కరోనా కట్టడి చర్యలకు విఘాతం కలిగించేలా కొత్త వైరస్ వేరియంట్ కనిపించడం పట్ల అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
సాధారణ కరోనా వైరస్తో పోల్చుకుంటే.. కొత్త స్ట్రెయిన్ 40 నుంచి 70 శాతం వేగంగా విస్తరించే అవకాశం ఉన్నందున.. కొన్ని కఠిన నిర్ణయాలు, చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చని సీడీసీ.. తన జర్నల్లో రాసుకొచ్చింది. చైనా.. ఇప్పటికే బ్రిటన్తో వాయు మార్గాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. బ్రిటన్కు విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేసింది. ఎప్పుడు పునరుద్ధరించేదీ వెల్లడించలేదు. కాగా- కరోనా కొత్త స్ట్రెయిన్ బారిన పడిన ఆ విద్యార్థినికి కోవిడ్ డిజిగ్నేటెడ్ ఆసుపత్రికి తరలించామని, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఈ వైరస్ భారత్ సహా అనేక దేశాల్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్లో కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా 25 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వైరస్ బారిన పడ్డారు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికాల్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో చైనా చేరింది. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి అత్యంత కఠినంగా వ్యవహరించే చైనా.. ఈ సారి ఎలాంటి ముందు జాగ్రత్తలను తీసుకుంటుందనేది చర్చనీయాంశమౌతోంది.