New Coronavirus strain: భయానకం: చిన్నపిల్లలకు మరింత సులువుగా: వారి పాలిట మృత్యువే
లండన్: బ్రిటన్లో కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్..మరింత ప్రమాదకారిగా తేలింది. కరోనా వైరస్ కంటే భయానక పరిస్థితులను సృష్టించే సామర్థ్యం దీనికి ఉన్నట్లు నిపుణులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి- చిన్నపిల్లలకు ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ మరింత సులువుగా సోకుతుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ దక్షిణ ప్రాంతంలో ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోకపోతే..దేశం మొత్తాన్నీ కమ్మేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
చిన్నపిల్లలకు అత్యంత ప్రమాదకారిగా..
కొత్త మ్యూటెంట్ కరోనా వైరస్ స్ట్రెయిన్ చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని న్యూ అండ్ ఎమర్జింగ్ రెస్పిరేటరీ వైరస్ థ్రెట్స్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్ఈఆర్వీటీఏజీ) నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్తో పోల్చుకుంటే.. చిన్నపిల్లలకు అతివేగంగా సోకుతుందని తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పీటర్ హార్బీ తెలిపారు. ఎన్ఈఆర్వీటీఏజీ నిపుణుల టీమ్కు ఆయనే నాయకత్వాన్ని వహిస్తున్నారు. కొత్త కరోనా స్ట్రెయిన్ చిన్నపిల్లలకు త్వరగా సోకుతుందనే విషయం శాస్త్రీయంగా నిర్ధారించినట్లు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ తెలిపారు.
70 శాతం వేగంగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న వేగంతో పోల్చుకుంటే.. మ్యూటెంట్ స్ట్రెయిన్.. 70 శాతం వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని ఎన్ఈఆర్వీటీఏజీ మెంబర్ వెండీ బార్క్లే పేర్కొన్నారు. పెద్దలతో పోల్చుకుంటే.. చిన్నపిల్లల్లో ఉండే కణాలు, రోగ నిరోధక శక్తి అత్యంత సున్నితంగా ఉంటుందని అన్నారు. ఆ సున్నితత్వం వల్ల వైరస్ను నిరోధించే శక్తి పిల్లల్లో తక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణమని తాము అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకలకు సిద్ధపడుతోన్న దేశ ప్రజలు కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
విమాన సర్వీసులు బంద్.. కర్ఫ్యూ..
కొత్త కరోనా వైరస్ మ్యూటెంట్ స్ట్రెయిన్ను నిరోధించడానికి బ్రిటన్ ప్రభుత్వం అనేక కఠిన చర్యలను తీసుకుంటోంది. రాత్రివేళ కర్ఫ్యూను విధించింది. లండన్ నగరంలో కొన్ని నెలల పాటు కొత్తగా లాక్డౌన్ను విధించే అవకాశాలను పరిశీలిస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ను నిరోధించడం కష్టతరమంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరికలను జారీ చేశారని, ముందస్తు జాగ్రత్తను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ తెలిపారు. ప్రస్తుతం లండన్లో నాలుగంచెల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను నిలిపివేశామని చెప్పారు.
భారత్ సహా అనేక దేశాలకు రాకపోకలు నిలిపివేత..
కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోండటాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక దేశాలు బ్రిటన్కు విమాన సర్వీసుల రాకపోకలను నిషేధించాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈ నెల 31వ తేదీ వరకు విమాన సర్వీసులకు నిలిపివేసింది. లండన్ సహా అన్ని ప్రధాన నగరాలకూ విమాన సర్వీసులను అందుబాటులోకి ఉండబోవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. విమాన సర్వీలపై విధించిన నిషేధాన్ని పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. మరోవంక- బ్రిటన్ నుంచి వస్తోన్న ప్రయాణికులందరినీ విమానాశ్రయాల నుంచి నేరుగా క్వారంటైన్కు తరలిస్తున్నారు.