కరోనాకు తోడుగా మరో వైరస్ దండయాత్ర: పాతదే.. కొత్తగా: ఉధృతంగా వ్యాప్తి: డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
కిన్షాసా: ప్రపంచాన్ని మట్టుబెట్టే దిశగా పరిణమించిన భయానక కరోనా వైరస్కు మరో మహమ్మారి జత కట్టింది. కరోనాకు తోడుగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఓ దేశాంపై పంజా విసిరింది. కరోనా తరహాలో శరవేగంగా వ్యాప్తి చెందట్లేదు. అయినప్పటికీ.. సమీప భవిష్యత్తులో అత్యంత భయానకంగా, వేగంగా విస్తరించడానికి అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ప్రస్తుతానికి ఒక దేశానికి మాత్రమే పరిమితమైన ఈ వైరస్ను ప్రారంభంలోనే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతోంది.
Recommended Video
వేకప్ అమెరికా..చంద్రుడిపై ట్రంప్: 19వ శతాబ్దం నాటి సెటైరికల్ పాలిటిక్స్: కరోనా పోస్టర్ కలకలం
నెలరోజుల్లో 48 కేసులు..
అదే ఎబోలా. ఈ వైరస్ పేరు విన్నదే. దాని ప్రభాం ఎలా ఉంటుందనేదీ తెలిసిన విషయమే. ఈ సారి మాత్రం అది తన రూపాన్ని మార్చుకుందని, మరింత బలపడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. ఇదివరకు వ్యాప్తి చెందిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సారి దాని విస్తరణలో వేగం కనిపించిందని చెప్పారు. నెలరోజుల వ్యవధిలో 48 కేసులు నమోదు అయ్యాయని, మున్ముందు ఈ వైరస్ మరింత వేగంగా విస్తరించడానికి అవకాశం లేకపోలేదని అన్నారు.
ఎబోలా అవుట్ బ్రేక్గా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
జూన్ 1వ తేదీ తొలిసారిగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోలో ఈ వైరస్ జాడ కనిపించింది. కాంగో పశ్చిమ ప్రాంతంలోని ఈక్వేటర్ ప్రావిన్స్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటిదాకా 50 మంది అనారోగ్యానికి గురయ్యారు. వారికి నిర్వహించిన పరీక్షల సందర్భంగా 48 మంది ఎబోలా బారిన పడినట్లు మైక్ ర్యాన్ వెల్లడించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి చెందడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెరీ యాక్టివ్ అవుట్ బ్రేక్గా అభివర్ణించారు. మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చడం ఖాయమనీ చెప్పారు.
11 సార్లు కాంగోలో వ్యాప్తి..
1976లో తొలిసారిగా కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందింది. అనంతరం దశలవారీగా అది ప్రభావం చూపుతూ వచ్చింది. ఇప్పటిదాకా కాంగోలో 11 సార్లు ఎబోలా వైరస్ విస్తరించింది. ఈ సారి మాత్రం ఈ వైరస్ గతంలో కంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మైక్ ర్యాన్ తెలిపారు. జూన్ 1వ తేదీన వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత 11,327 మందికి ఎబోలా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ.. అది తన రూపాన్ని మార్చుకోవడం వల్ల సులువుగా వ్యాప్తి చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు చెప్పారు.
వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి..
2018 ఆగస్టులో కాంగోలో వ్యాప్తి చెందిన ఎబోలా వైరస్.. 2277 మందిని బలి తీసుకుంది. అంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ గురించి హెచ్చరించింది. దీన్ని మహమ్మారిలా గుర్తించింది. కాంగో ఉత్తర ప్రాంతంలోని ఇటూరీ, నార్త్ కివూ ప్రావిన్స్లల్లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్యక్రమాలను చేపట్టింది. కరోనా వైరస్ తరహాలోనే దీని విస్తరణను నియంత్రించడానికి కొన్ని కఠిన చర్యలను చేపట్టక తప్పదని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. కరోనా తరహాలో ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా, లక్షలాదిమందిని పొట్టనబెట్టుకోకుండా నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాల్సి ఉందని అన్నారు.