మూత్రంతో విద్యుత్ ఉత్పత్తి: బ్రిటన్ శాస్త్రవేత్తలు సక్సెస్
లండన్: మూత్రాన్ని విద్యుత్గా మలచడంలో బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. దీనికోసం అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న సూక్ష్మ ఇంధన కణాన్ని కనుగొన్నారు. ఈ కొత్త టెక్నాలజీతో మూత్రం ద్వారా బయో ఎనర్జీని రూపొందిచే పరిశోధనలో బాత్ యూనివర్సిటీ, లండన్ క్వీన్మేరీ యూనివర్సిటీ, బ్రిస్టల్ రోబోటిక్స్ లాబోరేటరీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
ఈ కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ ద్వారా బయోఎనర్జీ ఉత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా బాత్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డీ లోరెంజో మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతుల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న దానికంటే శక్తిమంతమైన, చవకైన, సూక్ష్మ ఇంధన కణాన్ని తయారు చేశామని పేర్కొన్నారు.
తద్వారా సూక్ష్మ ఇంధన కణాలతో మూత్రం నుంచి పునరుత్పాదక బయోఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వృధా అవుతున్న మూత్రాన్ని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తే, ఆ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని ఆయన వెల్లడించారు.
ఇందుకోసం కార్బన్ గుడ్డ, టైటానియం వైరుని ఉపయోగించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి వేగం పెంచేందుకు గాను గుడ్డులోని తెల్లసొనని కూడా ఈ ప్రక్రియలో ఉపయోగించినట్లు తెలిపారు. ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు గాను ఎలక్ట్రోడ్స్ సైజుని 4 mm నుంచి 8 mm వరకు పెంచామని తెలిపారు.