కొత్త చరిత్ర: స్పేస్ ఎక్స్-నాసా సంయుక్త ప్రయోగం: అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు
వాషింగ్టన్: అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ రాకెట్ తయారీ సంస్థ స్పేస్ -ఎక్స్ నాసాతో కలిసి నలుగురు అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల 27 నిమిషాలకు స్పేస్ ఎక్స్ బృందం ఫాల్కన్ 9 రాకెట్లో అంతరిక్షంలోకి బయలుదేరింది. వ్యోమగాముల్లో మైక్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, షానన్ వాకర్తో పాటు జపాన్ వ్యోమగామి సోయిచి నొగుచిలు ఉన్నారు.వీరంతా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ల్యాండ్ అవుతారు.
Recommended Video
స్పేస్ ఎక్స్-నాసా తొలిసారిగా...
ఎలన్మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ తొలిసారిగా నాసాతో కలిసి ఈ ఆపరేషన్ను నిర్వహించింది. ఇప్పటి వరకు అమెరికా రెండు సార్లు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్కు పంపింది. 2011లో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక తొలిసారిగా పరీక్షలో భాగంగా డాగ్ హర్లే, బాబ్ బెహెన్కెన్లను ఈ ఏడాది మే నెలలో స్పేస్ స్టేషన్కు నాసా పంపింది. అక్కడ వారు 63 రోజులు పాటు ఉండి ఆ తర్వాత ఆగష్టులో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఇక తాజా ప్రయోగానికి వాతావరణం రూపంలో కొన్ని అడ్డంకులు ఎదురుకాగా ఆ తర్వాత అన్ని సెట్ కావడంతో మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది నాసా.
నింగిలోకి నిప్పులు కక్కుతూ...
కొన్ని వేల మంది ఈ రాకెట్ను చూస్తుండగా ఒక్కసారిగా నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. కెనెడీ స్పేస్ సెంటర్ వేదికగా నాసా-స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ను నింగిలోకి పంపాయి. ఇదిలా ఉంటే తొలిసారిగా ఒక వాణిజ్య సంస్థగా ఉండి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన సంస్థగా స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక ఈ ప్రయోగం సక్సెస్తో 2024 కల్లా చంద్రుడిపై మానవుడిని పంపాలని ఆ తర్వాత అంగారకుడిపై కూడా మనిషిని పంపాలన్న యోచనతో నాసా ఉంది. ఇక చివరిసారిగా చంద్రుడిపై మనిషి 1972లో అడుగు పెట్టాడు. ఈ రోజు జరిగిన ప్రయోగంతో త్వరలోనే అనుకున్న లక్ష్యాలను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు నాసా అడ్మినిస్ట్రేటర్ బ్రిడెన్స్టైన్.
ఆరు నెలల పాటు అక్కడే...
ఇక స్పేస్ స్టేషన్లో అడుగు పెట్టకముందు 27గంటల పాటు ఈ వ్యోమగాములు అంతరిక్షంలో సమయం గడుపుతారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ల్యాండ్ అవుతారు. అక్కడ ఆరు నెలల పాటు ఉంటారు. స్పేస్ స్టేషన్లో ఇప్పటికే ఉన్న వ్యోమగాములు కేట్ రూబిన్స్, సెర్జీ రిజికోవ్, సెర్జీ కుద్-స్వెర్కోవ్లను జాయిన్ అవుతారు. వీరంతా అక్టోబర్ నెలలో సోయుజ్ ఎంఎస్-17 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్వేస్ స్టేషన్కు చేరుకున్నారు. త్వరలోనే వీరు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతారని సమాచారం.