బాగ్దాదీ వారసుడు పుట్టుకొచ్చాడు: ఐసిస్ చీఫ్ గా సద్దాం హుస్సేన్ కుడిభుజం!
బాగ్దాద్: సిరియాను కేంద్ర బిందువుగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను సాగించిన ఇస్లామిక్ స్టేట్స్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ వారసుడు పుట్టుకొచ్చాడు. ఇరాక్ కు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్లా కార్దాష్ కు ఐసిస్ బాధ్యతలను అప్పగించినట్లు విదేశీ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్స్ ఓ అధికారిక ప్రకటన చేసిందని పేర్కొంది. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సైన్యంలో అబ్దుల్లా కమాండర్ స్థాయిలో వ్యవహరించాడని నిర్ధారించింది. సద్దాం హుస్సేన్ మరణించిన అనంతరం ప్రొఫెసర్ గా స్థిరపడినట్లు ధృవీకరించింది. ఇప్పటికే అబ్దుల్లా.. రోజువారీ ఐసిస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు.
బాగ్దాదీ నిజంగానే మరణించాడా: నమ్మబుద్ధేయట్లేదంటోన్న పాకిస్తాన్ మాజీ!
బాగ్దాదీ మరణంపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు ఇస్లామిక్ స్టేట్స్. అతని స్థానంలో అబ్డుల్లా కార్దాష్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వెలువడటంతో బాగ్దాదీ హతమైన విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. బాగ్దాదీ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే అధికార మార్పడి చోటు చేసుకుందని, అబ్డుల్లా బాధ్యతలను సైతం స్వీకరించాడని అంటున్నారు.
సీఐఏ అధికారులను ఉటంకిస్తూ విదేశీ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. అబ్డుల్లా కార్దాష్.. ప్రొఫెసర్ గా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడని సమాచారం. బాగ్దాదీ ముగ్గురు కుమారులు కూడా అమెరికా సైనిక చర్యల్లో హతమైన నేపథ్యంలో ఏర్పడిన నాయకత్వ లోటును భర్తీ చేసుకోవడానికి అప్పటికప్పుడు అబ్దుల్లాకు బాధ్యతలను అప్పగించినట్లయిందని చెబుతోంది విదేశీ మీడియా.