వేధిస్తున్నారు: ఢిల్లీ పాక్ హైకమిషన్ ఫిర్యాదు, విచారిస్తాం.. మావాళ్ల సంగతేంటి: భారత్ ధీటుగా
న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ మధ్య మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఇరువైపుల రాయబారులు ఫిర్యాదులు చేస్తున్నారు. తమను, తమ కుటుంబాలను వేధిస్తున్నారని ఇరు దేశాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు.
దాదాపు నెల రోజుల క్రితం ఇస్లామాబాద్లోని భారత దౌత్యవేత్తలు వేధింపుల విషయమై అక్కడ ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా పలు కుటుంబాలు భారత్ వచ్చాయి.
అక్కడ చదువుతున్న తమ పిల్లలను స్కూల్ మానిపించే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, పాకిస్తాన్ ఏజెన్సీలు భారతీయుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్పై దాడులు కూడా నిర్వహించినట్లు భారత్ ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా, తాజాగా తాము వేధింపులు ఎదుర్కొంటున్నామని ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్.. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపడతామని విదేశాంగ శాఖ హామీ ఇచ్చింది.
అదే సమయంలో, పాకిస్తాన్లోని తమ సిబ్బంది అనేకసార్లు వేధింపులు ఎదుర్కొన్నారని గుర్తు చేసింది.
కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమానికి వెళ్తున్న భారత హైకమిషనర్ కారును పాకిస్తాన్ ఏజెన్సీలకు చెందిన కొందరు ఆందోళనకారులు రోడ్డు మధ్యలో అడ్డుకున్నారని, ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయన్నారు. ఇస్లామాబాద్లోని తమ సిబ్బంది ఫోన్లకు అసభ్యకర కాల్స్, సందేశాలు వస్తున్నాయన్నారు. దొంగతనాలు కూడా జరిగాయన్నారు.
కానీ వీటిని ఎప్పుడు కూడా తాము మీడియాకు చెప్పలేదని, దౌత్యపరమైన చర్చలతో సమస్యను పరిష్కరించాలని చూస్తున్నామని, కానీ ఇస్లామాబాద్ మాత్రం అలా వ్యవహరించడం లేదన్నారు.
అదే సమయంలో భారత్లో పని చేసే దౌత్య సిబ్బంది భద్రతకు తమ దేశం కట్టుబడి ఉందని, పాకిస్తాన్ సిబ్బంది వేధింపులపై దర్యాఫ్తు చేస్తామని తెలిపింది.