పాక్లో తలదాచుకున్న తాలిబన్ చీఫ్!
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు పెట్టింది పేరుగా రెచ్చిపోయిన తాలిబన్ ప్రస్తుత చీఫ్ మన్సూర్ అక్తర్ కు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చిందని, అతనిని కాపాడటానికి ఆదేశ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆఫ్గనిస్థాన్ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్ రాజధాని సమీపంలోనే తాలిబన్ నేత మన్సూర్ అక్తర్ తలదాచుకున్నాడని, పాక్ అధికారుల కనుసన్నలలో అతను సంచరిస్తున్నాడని అఫ్గనిస్థాన్ అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయంలో పాకిస్థాన్ మాత్రం నోరువిప్పడం లేదు.
పాక్ మాజీ రక్షణ శాఖ మంత్రి చౌదరి అహమ్మద్ ముక్తార్ ఇటివల భారత్ కు చెందిన ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలోనే తల దాచుకున్నాడని పాకిస్థాన్ కు ముందే తెలుసు అని అన్నారు.
తమ దేశం ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఫ్గనిస్థాన్ ఉన్నతాధికారులు స్పందించారు. మీ దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తాము ముందే చెప్పినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఒసామా బిన్ లాడెన్ కాకుండా ఆయన అనంతరం తాలిబన్ చీఫ్ ముల్లా ఓమర్ పాక్ లోనే తలదాచుకున్నాడని వారు ఆరోపించారు. ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ అక్తర్ పాక్ లో తలదాచుకున్నాడని, అయితే అక్కడి అధికారులు మాత్రం వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.