కరోనా : న్యూయార్క్ను వెంటాడుతోన్న విషాదం.. ఒక్కరోజే 731 మంది మృతి..
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల నెంబర్ గుండెల్లో దడ పుట్టిస్తోంది. క్షణాక్షణానికి కేసుల సంఖ్య పెరుగుతుండటం.. ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్,న్యూజెర్సీ నగరాల్లో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క న్యూయార్క్ నగరంలోనే 731 మంది మృత్యువాత పడినట్టు అక్కడి గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో ఇప్పటివరకు నమోదైన మరణాల్లో ఇదే అత్యధికం. గత శుక్రవారం నమోదైన 630 మరణాల రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా న్యూయార్క్ రాష్ట్రంలో 5489 మంది మృత్యువాతపడ్డారు.
'ఈరోజు మేము కోల్పోయిన ఆ 731 మంది.. ఒక్కో నెంబర్ వెనకాల ఒక్కో వ్యక్తి జీవితం ఉంది. వారి వెనకాల ఒక కుటుంబం ఉంది,ఒక తల్లి ఉంది,ఒక తండ్రి ఉన్నాడు,ఒక అక్కా,చెల్లె,అన్నాదమ్ముళ్లు ఉన్నారు. ఈరోజు న్యూయార్క్ వాసులకు అత్యంత విషాదాన్ని మిగిల్చిన రోజు..' అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆవేదన వ్యక్తం చేశారు. తాజా మరణాల్లో గత వారం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినవాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ఓపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి భారీ మొత్తంలో నిధులు తీసుకుని చైనా కోసం పనిచేస్తున్నారా అని మండిపడ్డారు.చైనాకు ఇప్పటికీ తలుపులు తెరిచే ఉంచాలన్న డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదనను అదృష్టవశాత్తు తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు.
Recommended Video
ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 386587 కేసులు నమోదవగా.. 12,275 మంది మృతి చెందారు. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే న్యూయార్క్లో 131,830 కేసులు 5వేల పైచిలుకు మరణాలు,న్యూజెర్సీలో 41,090 పాజిటివ్ కేసులు, 1003 మరణాలు,మిచిగాన్లో 17,221 కేసులు,727 మరణాలు,కాలిఫోర్నియాలో 16349 కేసులు,388 మరణాలు సంభవించాయి.