న్యూజిలాండ్ను కుదిపేసిన భూకంపం: సునామీ హెచ్చరిక
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్లోని దక్షిణ దీవిని భారీ భూకంపం కుదిపేసింది. అది రెక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. సునామీ ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.
క్రైస్ట్ చర్చికి 50 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రం నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి ఈ భూకంపం వచ్చింది. తూర్పు తీర ప్రాంతంలో భయంకరమైన కెరటాలు వస్తున్నాయి.
న్యూజీలాండ్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు సునామీ మొదటి మృత్యు అల దక్షిణ దీవిని తాకింది. మరికొన్ని గంటల పాటు సౌత్ ఐలండ్ను ముంచెత్తే ప్రమాదం ఉందని న్యూజీలాండ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర మేనేజ్మెంట్ తెలిపింది. దీంతో భారీగా విధ్వంసం జరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వందమంది చనిపోయారని, వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయని సమాచారం. సునామీ కెరటాలతో వెల్లింగ్టన్ వణికిపోతోంది. భూకంప తీవ్రతను తొలుత 7.4గా పేర్కొన్న అధికారులు ఆ తర్వాత 7.8గా మార్చారు.
న్యూజిలాండ్కు దక్షిణంగా ఉన్న ద్వీపం క్రైస్ట్చర్చ్లో 2011 ఫిబ్రవరిలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, 185మంది మృత్యువాతపడ్డారు. తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది.
అర్జెంటీనాలోనూ...
అర్జెంటైనాలో భారీ భూకంపం సంభవించింది. లా రియోజా ప్రావిన్స్లోని ఫమాటినాకు మూడు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. 2 గంటల క్రితం న్యూజీలాండ్లో భూకంపంతో పాటు సునామీ కూడా వచ్చింది. ఈ తరుణంలో అర్జెంటైనాను కూడా భూకంపం తాకింది.