మనుషులా? బొమ్మలా?: పబ్జీ గేమ్ తరహాలో జనాన్ని కాల్చి పడేశాడు! మృతదేహాలపైనా బుల్లెట్ల వర్షం
క్రైస్ట్ చర్చ్: పబ్జీ గేమ్ తెలుసుగా! ఈ మధ్యే మనదేశంలో బాగా పాపులర్ అయిన అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్. మనదేశంలో దాదాపు సగం మంది జనాభా దీనికి బానిసలయ్యారని ఓ సర్వే చెబుతోంది. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చుకుంటూ గమ్యస్థానాన్ని చేరడం ఈ గేమ్ ప్రధాన ఉద్దేశం. అంతం అనేదే లేదా అనేంతలా సాగుతుంది ఈ గేమ్. షర్ట్ బటన్ లేదా సీసీ కెమెరాను అమర్చిన హెల్మెట్ ను ధరించి, యానిమేటెడ్ బొమ్మలపై కాల్పులు జరుపుకుంటూ వెళ్తారు ఈ గేమ్ లో.
న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లోని మసీదుల్లో చోటు చేసుకున్న కాల్పుల ఉదంతం కూడా.. పబ్జీ గేమ్ కు తీసిపోని విధంగా సాగిందని తెలుస్తోంది అక్కడి పరిసరాలను చూస్తోంటే. నిస్సహాయంగా ఓ మూలకు దాక్కున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుకుంటూ వెళ్లారు దుర్మార్గులు. పబ్జీ గేమ్ లో కనిపించే ఆటోమేటెడ్ రైఫిల్ నే ఇక్కడా వినియోగించారు. తమ దారుణాలను ప్రపంచానికి తెలియజేయటానికి సీసీ కెమెరాలను వాడారు. దుండగులు తాము ధరించిన చొక్కా గుండీలకు సీసీ కెమెరాలను అమర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పబ్జీ గేమ్ తరహాలోనే ఇక్కడ కూడా హంతకుడు ఆర్మీ దుస్తులను ధరించాడు.
మసీదులో సృష్టించిన మారణహోమాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం.. వారిలోని శాడిజానికి పరాకాష్ట. ఫేస్ బుక్ లో ఈ కిరాతకం సుమారు 17 నిమిషాల పాటు లైవ్ టెలికాస్ట్ అయింద. అనంతరం ఆ వీడియోను ఫేస్ బుక్ యాజమాన్యం తొలగించింది.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజీలాండ్.. ఈ మారణ హోమంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పులకు తెగబడ్డ వారిలో కనీస మానవత్వం లేదనిపించేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. సీసీ కెమెరాను అమర్చిన హెల్మెట్ ను నెత్తిన ధరించి, కాల్పులకు పాల్పడటం.. ఆ నరహంతకునిలోని క్రూర లక్షణాలకు సజీవ సాక్ష్యాలు. పారిపోతున్న వారిని వెంబడించి మరీ బుల్లెట్ల వర్షం కురిపించాడు. ప్రాణభయంతో ఓ మూల నక్కిన వారిపై తుపాకీని ఎక్కు పెట్టాడు.
చివరికి- మృతదేహాలపైన కూడా కాల్పులు జరపడం అతని మానసిక ప్రవృత్తికి అద్దం పట్టింది. రక్తపు మడుగులో పడి ఉన్న విగత జీవులపైనా కాల్పులు జరిపి, తన కర్కశత్వాన్ని నిరూపించుకున్నాడా హంతకుడు. పవిత్ర మసీదులో రక్తపుటేరులు పారించాడు. శుక్రవారం ముస్లింలకు పవిత్ర రోజు. ఆ రోజంతా ముస్లింలు ప్రార్థనలతో గడిపేస్తారు. అలాంటి సమయంలో క్రైస్ట్ చర్చ్ లోని రెండు మసీదుల్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 49 మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.