క్రైస్ట్చర్చ్ మారణహోమం: దురహంకారం.. కోర్టులో విజయసంకేతాన్ని చూపిన నిందితుడు
వెల్లింగ్టన్: క్రైస్ట్ చర్చ్ దాడి నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ సిటీలో రెండు మసీదుల్లోకి చొరబడి జాత్యాహంకార ఉన్మాది బ్రెంటన్ టారెంట్ 50 మందిని ఊచకోత కోసిన విషయం తెలిసిందే. తాను చేసిన ఘోరంపై అతను ఏమాత్రం పశ్చాత్తాపపడలేదట. పైగా విజయగర్వం ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
పోలీసులు అతనిని శనివారం కోర్టులో హాజరుపరిచారు. ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదట. తెల్లని జైలు దుస్తుల్లో, చేతులకు బేడీలతో బోనులో నిల్చున్నాడు. జడ్జి హత్య అభియోగాలు మోపుతున్నట్టు చెప్పగానే... నిందితుడు తన తలను ఒక్కసారి పైనుంచి కిందకు ఊపి, తన కుడి చేతి బొటన వేలును, చూపుడు వేలును గుండ్రంగా చుట్టి తన అంగీకారం తెలిపాడట. శ్వేత జాతీయులు తమ అధికార దర్పాన్ని లేదా విజయగర్వానికి సంకేతంగా ఈ సంజ్ఞ చేస్తారు.
9 ని.ల ముందే నాకు దాడి సమాచారం, కానీ: క్రైస్ట్చర్చ్ దాడిపై ప్రధాని, 50కి చేరిన మృతులు
హత్య అభియోగాలను బట్టి బ్రెంటన్ మరణించే వరకూ జైల్లోనే ఉండాల్సి రావచ్చు. నిందితుడు బెయిల్ అడుగకపోవడంతో పోలీసులు అతడిని మళ్లీ తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేశారు. తనను తాను ఫాసిస్టుగా ప్రకటించుకున్న నిందితుడు... కోర్టు విచారణ సమయంలో మౌనంగా ఉన్నాడు.
కోర్టు హాలులో నిల్చున్న నిందితుని ముఖాన్ని మీడియాలో ప్రచురించరాదని జడ్జి ఆదేశించారు. నిందితుడు బ్రెంటన్ వయస్సు 28. మారణహోమంలో గాయపడిన వారికి జిల్లా కోర్టుకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.