టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని జెసిండా: ఒక్కసారిగా భూకంపం, భవనం కదులుతున్నా బెదరలేదు
వెల్లింగ్టన్: ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని తరిమికొట్టి ప్రశంసలందుకుంటున్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. మరోసారి అందరినీ దృష్టిని ఆకర్షించారు. అసలు విషయంలోకి వెళితే సోమవారం ఉదయం న్యూజిలాండ్లో భూ కంపం రావడంతో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది.
ఓ వైపు భూమి కంపిస్తున్నా..
కాగా, భూమి కంపించిన సమయంలో ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాత్రం ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆమె ఉన్న భవనం కుదుపులకు గురవుతున్నా.. పెద్దగా ఆందోళనచెందలేదు. అయితే, జెసిండా ధీమాకు కూడా ఓ కారణం ఉంది. పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలకు సైతం తట్టుకునేలా నిర్మించారు. ఏదైమైనా భూమి కంపిస్తున్న సమయంలోనూ ఆమె ఇంటర్వ్యూను కొనసాగించడం మామూలు విషయం ఏమీకాదు.
వస్తువులు కదులుతున్నాయంటూ..
భూమి కంపించిన సమయంలో ఇంటర్వ్యూ శైలి కొంత మారిపోయింది. ఇక్కడ భూమి కంపిస్తోంది. చుట్టు వస్తువులు కదులుతున్నాయి చూశావా? అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న ర్యాన్ను జెసిండా అడిగారు. ‘ఇక ఆగిపోయింది. సురక్షితంగా ఉన్నాం. నాపై ఎలాంటి వేలాడుతున్న లైట్లు లేవు. నేను ఉన్న నిర్మాణం చాలా దృఢమైనదనుకుంటా' అని కాసేపటి తర్వాత చాలా సాధారణంగా వ్యాఖ్యానించారు జెసిండా.
జెసిండా రియాక్షన్స్ వైరల్..
అంతేగాక, ఆమెలో ఆ సమయంలో ఎలాంటి భయం.. ఆందోళన లేకపోవడం గమనార్హం. ఆమె రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, న్యూజిలాండ్లో సోమవారం ఉదయం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్ల లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఏడాది జనవరిలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దానికంటే తాజా భూకంపం కొంచెం బలమైనదే. కాగా, 2011లో క్రైస్ట చర్చ్ నగరంలో భూకంపం సంభవించగా 185 మంది మరణించారు.