నాకు లాయర్ వద్దు, నేనే వాదించుకుంటా: క్రైస్ట్ చర్చ్ నిందితుడు, పశ్చాత్తాపంలేదు
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లో నలభై మందికి పైగా పొట్టన పెట్టుకున్న న్యూజిలాండ్ దాడి నిందితుడు బ్రెంటన్ టారంట్పై క్రైస్ట్చర్చ్ డిస్ట్రిక్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ సమయంలో నిందితుడు ముఖంలో పశ్చాత్తాపం కనిపించలేదు. అంతేకాకుండా ఈ కేసులో తన తరఫున వాదించేందుకు లాయర్ను కూడా వద్దన్నాడు.
నిందితుడి తరఫున వాదించేందుకు లాయర్ను నియమించిన కోర్టు, కానీ
నిందితుడు బ్రెంటన్ (28) తరఫున వాదించేందుకు కోర్టు డ్యూటీ లాయర్ రిచర్డ్ పీటర్స్ను నియమించింది. అయితే ఇందుకు బ్రెంటన్ అంగీకరించలేదని లాయర్ రిచర్డ్ పీటర్స్ చెప్పారు. తనకు లాయర్ అవసరం లేదని, తన కేసును తానే వాదించుకుంటానని బ్రెంటన్ చెప్పాడన్నారు. బ్రెంటన్లో అతివాద భావాలు ఎక్కువగా ఉన్నాయని, అంతమందిని చంపినందుకు అతడిలో ఏ మాత్రం పశ్చాత్తాప ధోరణి లేదన్నారు.
ఏప్రిల్ 5 వరకు రిమాండ్
బ్రెంటన్ టారెంట్ను శనివారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఆయనను ఏప్రిల్ 5వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండుకు తరలించింది. ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లో రెండు మసీదుల్లో మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం క్రైస్ట్ చర్చ్లోని రెండు మసీదుల్లోకి చొరబడ్డ అతను అక్కడ ప్రార్థనల్లో నిమగ్నమైన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పైగా తన చర్యను ఆన్లైన్లో లైవ్గా ఇచ్చాడు.
పదిరోజుల్లో తుపాకీ చట్టంలో మార్పులు
కాగా, తుపాకీ వినియోగంపై కొత్త చట్టాన్ని పది రోజుల్లో తీసుకు వస్తామని న్యూజిలాండ్ ప్రధాని జసిండ్రా తెలిపారు. తుపాకీ చట్టంలో మార్పులకు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నిందితుడు బ్రెంటన్ ఆస్ట్రేలియన్.