9 ని.ల ముందే నాకు దాడి సమాచారం, కానీ: క్రైస్ట్చర్చ్ దాడిపై ప్రధాని, 50కి చేరిన మృతులు
వెల్లింగ్టన్: క్రిస్ట్ చర్చ్లో శుక్రవారం జరిగిన దాడులపై న్యూజిలాండ్ పోలీస్ కమిషనర్ మైక్ బుష్ మాట్లాడారు. ఈ దాడుల విషయం తెలియగానే పోలీసులు స్పందించిన తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ విషాధ సంఘటన గురించి తెలియగానే నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకున్నారని తెలిపారు. తెలిసిన ఆరు నిమిషాల్లో స్పందించారని, పది నిమిషాల్లో అక్కడకు పోలీసులు అంతా చేరుకున్నారని, 36 నిమిషాల్లో ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామన్నారు.
ఆ విషాధ సంఘటనపై పోలీసులకు మధ్యాహ్నం 1.41 నిమిషాలకు ఫోన్ వచ్చిందని, ఆరు నిమిషాల్లోనే అంటే 1.47 నిమిషాలకు మొదట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని, ఆ తర్వాత తమ ఆర్మ్డ్ అఫెండర్స్ స్క్వాడ్ 10 నిమిషాల్లో చేరుకుందని చెప్పారు.
మమ్మల్ని క్షమించండి..! నరమేధం పై న్యూజీలాండ్ వాసుల వేడుకోలు..!!
జసిండ్ర ఆర్డెన్
ఈ ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జసిండ్ర ఆర్డెన్ ఆదివారం మాట్లాడారు. తమ ప్రభుత్వం తుపాకీని ఉపయోగించే విషయమై చట్టాలను మారుస్తామని, ఈ మేరకు సోమవారం చర్చిస్తామని తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు కారకుడు ఆస్ట్రేలియన్ అని చెప్పారు. అలాగే, న్యూజిలాండ్ మసీదుల్లో నరమేధం సృష్టించిన దుండగుడు ఘటనకు 9 నిమిషాల ముందే తన కార్యాలయానికి సమాచారం అందించినట్లు ప్రధాని జసిండ్రా వెల్లడించారు.
తీవ్ర అతివాద భావజాలంతో
ఈ మేరకు తన లక్ష్యాలను వివరిస్తూ కార్యాలయానికి మెయిల్ చేశాడని చెప్పారు. అది తీవ్ర అతివాద భావజాలంతో ఉందన్నారు. తనతో పాటు మరో ముప్పై మందికి కూడా ఆ దుండగుడు సమాచారం అందించాడన్నారు. కానీ దాడికి సంబంధించి ఎటువంటి వివరాలు అందులో పేర్కొనలేదన్నారు. సమాచారం తెలిసిన 2 నిమిషాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలా దాడి చేయబోతున్నాడో సమాచారం లేకపోవడంతో అడ్డుకునే సమయం లేకపోయిందన్నారు.
సోషల్ మీడియా దాడికి
దుండగుడు దాడిని ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేశాడు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాని జసిండ్రా.. ఫేస్బుక్ను కోరారు. అలాగే సోషల్ మీడియా దాడికి సంబంధించిన వీడియోలు ఇంకా చక్కర్లు కొడుతుండడంపై ఆమె ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై సదరు కంపెనీలు వెంటనే సమాధానం ఇవ్వాలన్నారు. న్యూజిలాండ్ మసీదుల్లో శుక్రవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారు.