అబ్బే..వట్టిదే..! విజయ్ మాల్యాపై వస్తున్న ఆ వార్తల్లో నిజం లేదు,కావాలనే చేస్తున్నారా..?
లండన్: ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను యూకే నుంచి భారత్కు రప్పించేందుకు చేస్తున్న న్యాయపరమైన ప్రయత్నాలన్నీ ముగిశాయని ఇక ఏ క్షణమైనా మాల్యా భారత్కు వచ్చే అవకాశాలున్నాయంటూ బుధవారం సోషల్ మీడియాలో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అంతేకాదు ఏకంగా ఓ న్యూస్ ఛానెల్ అయితే మాల్యా లండన్ నుంచి ముంబైకి వచ్చేందుకు విమానం కూడా ఎక్కేశాడంటూ కథనాలు నడిపాయి. తనతో పాటు సీబీఐ మరియు ఈడీ అధికారులు కూడా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మాల్యా పీఏ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో మాల్యా పై వార్తలు
భారత్లో వివిధ బ్యాంకుల వద్ద రూ.9,961 కోట్లు రుణంగా తీసుకుని వాటిని ఎగవేసి ఆపై దివాలా తీసి లండన్కు ఎగిరిపోయిన మాల్యా అక్కడ ఓ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇక మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లండన్ కోర్టు మాల్యాను నేరస్తుడిగా నమ్ముతూ భారత్కు అప్పగించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. మాల్యాను తిరిగి భారత్కు రప్పించే క్రమంలో న్యాయప్రక్రియ ముగిసినందున ఇక ఏక్షణమైనా భారత్కు వచ్చే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మాల్యా పీఏ క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే మాల్యా భారత్కు వెళుతున్నారా అనే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు ఆయన లాయర్ ఆనంద్ దూబేకు పలు మీడియా సంస్థలు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అయితే బుధవారం రోజున భారత్కు వస్తున్నారా అంటూ ఓ మీడియా అడిగిన ప్రశ్నకు మాల్యా వాట్సాప్ ద్వారా సమాధానం పంపారు. ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న వారికే తెలియాలంటూ మాల్యా స్పందించారు.
క్లారిటీ ఇచ్చిన లండన్లోని హైకమిషన్ కార్యాలయం
ఇదిలా ఉంటే లండన్లోని హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి మాల్యా ప్రయాణంపై స్పందించారు. సోషల్ మీడియా, ఇతర వార్తా ఛానెల్స్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. విజయ్ మాల్యా భారత్కు ప్రస్తుతం అయితే వెళ్లడం లేదని నిర్ధారించారు. సీబీఐ గతంలో జారీ చేసిన పాత ప్రకటనను మీడియా ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే కోర్టు ప్రక్రియ ముగిసినప్పటికీ యూకే హోం సెక్రటరీ ప్రీతీ పటేల్ మాల్యాను భారత్కు అప్పగించే విషయమై తయారు చేసిన డాక్యుమెంట్లపై సంతకం చేయడంలో జాప్యం చేస్తున్నట్లు సమాచారం. దీని వెనక కారణాలు కూడా ఉన్నాయనే విషయం ప్రచారం జరుగుతోంది.
కావాలనే జాప్యం జరుగుతోందా..?
మాల్యా ఆశ్రయం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంటారని ఇందుకోసమే డాక్యుమెంట్లపై సంతకాలు చేయడంలో జాప్యం జరుగుతోందనే వార్త ప్రచారంలో ఉంది. ఇది కాకుండా లండన్లో మాల్యాపై మరిన్ని కేసులు నమోదు కాగా ఆ కేసులు కూడా మాల్యా భారత్కు రాకుండా అడ్డుకుంటున్నాయని సమాచారం . బ్యాంకులకు రూ.900 కోట్లకు పైగా రుణాలు ఎగవేశారనే కేసు ఉంటుండగా మరోవైపు యునైటెడ్ స్పిరిట్స్ ఛైర్మెన్గా ఉన్న సమయంలో డియాజియో నుంచి రూ.303 కోట్లు తీసుకున్నారనే మరో కేసును కూడా ఎదుర్కొంటున్నాడు.
Recommended Video
మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి కూడా క్లారిటీ
ఇదిలా ఉంటే భారత్కు విజయ్ మాల్యాను అప్పగించే విషయమై ఇప్పటి వరకు ఫలానా తేదీ అని నిర్ణయించలేదని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. మాల్యాను హీత్రో విమానాశ్రయానికి తీసుకెళ్లాల్సింది మెట్రోపాలిటన్ పోలీసులే కాబట్టి వారినుంచి ఎలాంటి సమాచారం లేదని మెట్రోపాలిటన్ పోలీసుల ప్రతినిధి ఒకరు చెప్పారు. మెట్రోపాలిటన్ పోలీసులే మాల్యాను భారత అధికారులకు విమానాశ్రయంలో అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక భారత్కు తీసుకొచ్చేందుకు జరుగుతున్న న్యాయప్రక్రియలో మే 14న వచ్చిన తీర్పుతో మాల్యా లండన్ కథ ముగింపు దశకు చేరింది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 28 రోజుల్లోగా మాల్యాను భారత్కు తీసుకురావాల్సి ఉంది. లేదంటే మాల్యానే తనను వీలైనంత త్వరగా భారత్కు పంపాలని కోర్టులను కోరే ఛాన్స్ కూడా ఉంది.