టిక్టాక్ను కొనుగోలుకు ఆ టెక్ దిగ్గజ సంస్థ చర్చలు..? అదే జరిగితే భారత్లో..!
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే పలు చైనా యాప్లపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా అమెరికా ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో ముందుకువచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో యాప్ టిక్టాక్ మాతృసంస్థ బైట్డాన్స్ను అమెరికా కంపెనీగా గుర్తించాలని ట్రంప్ పట్టుబడినట్లు సమాచారం. ఇకపై చైనా యాప్ కాకుండా అమెరికా సంస్థగా గుర్తిస్తే దీనిపై ఎలాంటి నిషేధం విధించబోమని ట్రంప్ చెప్పడంతో టిక్టాక్ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈమేరకు బైట్డాన్స్తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Recommended Video
ట్రంప్ ఏమన్నారు..
వైట్హౌజ్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ టిక్టాక్ యాప్పై చర్చిస్తున్నామన్నారు. అంతేకాదు ఆ యాప్పై నిషేధం విధించాలని కూడా భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్ భవిష్యత్తులో చాలా మార్పులు ఉంటాయని అన్నారు. అదే సమయంలో ఇతర ఆప్షన్స్ పై కూడా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెబుతుందని అగ్రరాజ్యపు అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పలు అంతర్జాతీయ పత్రికలు కొన్ని కథనాలను ప్రచురించాయి.
అంతర్జాతీయ పత్రికల కథనం ఏంటి..?
బైట్డాన్స్కు చెందిన టిక్ టాక్ వీడియో యాప్ను మాత్రం అమెరికా సంస్థకు విక్రయించాలని ట్రంప్ సర్కార్ త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు కథనాలను ప్రచురించాయి. అంతేకాదు అమెరికాకు చెందిన చాలా టెక్ దిగ్గజ సంస్థలు, ఫైనాన్షియల్ కంపెనీలు టిక్టాక్ యాప్ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్... టిక్టాక్ యాప్ను కొనుగోలు చేసేందుకు బైట్డాన్స్ సంస్థతో చర్చలు ప్రారంభించినట్లు న్యూయార్క్ టైమ్స్ మరియు ఫాక్స్ బిజినెస్లు ఒక కథనం ప్రచురించాయి. అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
టిక్టాక్ ప్రకటన
ఇదిలా ఉంటే వస్తున్న వార్తలపై, లేదా జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయమని చెబుతూనే దీర్ఘకాలంలో టిక్టాక్ ఒక పెద్ద సక్సెస్ అవుతుందని టిక్ టాక్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. బైట్డాన్స్ టిక్టాక్ను 2017లో ప్రారంభించింది. అనంతరం అమెరికా యూరోప్ దేశాల్లో పాపులర్ అయిన ముజికల్ డాట్ లీ వీడియో యాప్ను కొనుగోలు చేసి రెండిటిని కలిపేసింది. రెండిటినీ కలిపేసి డాయిన్ పేరుతో చైనా యూజర్స్కు అందిస్తోంది. మరోవైపు టిక్టాక్ యూజర్ ఫ్రెండ్లీగా ముద్రవేసుకోవడంతో అనతి కాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. ఎంతగా పాపులర్ అయ్యిందంటే ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్బుక్, మరియు షేర్చాట్లను కూడా హడలెత్తించింది. కొన్ని మిలియన్ల సంఖ్యలో అమెరికా నుంచే టిక్టాక్కు యూజర్లు ఉండగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల మిలియన్ యూజర్లు ఈ పాపులర్ వీడియో యాప్ కు ఉన్నారు.
చైనాకు చెందని సంస్థగా గుర్తింపు పొందేందుకు
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేయండంపై బైట్డాన్స్ సంస్థపై డ్రాగన్ కంట్రీ గుర్రుగా ఉంది. అంతేకాదు చైనా అధికారులతో యూజర్ డేటాను షేర్ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తుండటంపై బైట్ డాన్స్ సంస్థ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక టిక్టాక్ పై కొన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వెంటనే వాటికి తెరదించుతూ టిక్ టాక్ సీఈఓను అమెరికాకు చెందిన వ్యక్తిని నియమించుకుంది. తద్వారా చైనా ప్రభుత్వం అమెరికా యూజర్కు చెందిన డేటా ఇవ్వాలని ఒత్తిడి చేసినా అది జరగదనే సంకేతాలు పంపింది. అంటే ఇకపై అది చైనా సంస్థగా గుర్తించబడకూడదనే సంకేతాలను బైట్ డాన్స్ సంస్థ పంపింది.
అమెరికా చేతికి వెళితే భారత్లో నిషేధం ఎత్తివేస్తారా...
మొత్తానికి టిక్టాక్ యాప్ పై ఇతర దేశాలు కూడా నిషేధం విధించాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. టిక్టాక్కు మంచి యూజర్ బేస్ ఉన్న భారత్లో ఇప్పటికే ఈ యాప్పై నిషేధం విధించడం జరిగింది. భారత్ - చైనా దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భద్రతాకారణాల దృష్ట్యా టిక్టాక్పై నిషేధం విధించాలని మోడీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఒకవేళ టిక్టాప్ యాప్ భారత మిత్రదేశం అయిన అమెరికా చేతిలోకి వెళితే కనుక ఈ యాప్పై భారత్ నిషేధం ఎత్తివేసే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.