కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా.. అక్టోబర్లోనే..!
కరోనావైరస్ను విజయవంతంగా ఎదుర్కొన్న దేశంగా రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ దేశం...ఈ మహమ్మారిని నియంత్రించేందుకు మరో నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. ప్రస్తుతం జరగాల్సిన సాధారణ ఎన్నికలను నాలుగువారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే అక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఆదేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పేర్కొంది. అయితే ఆపై వాయిదా వేయమని ఆ రోజున నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
17 అక్టోబర్కు ఎన్నికలు వాయిదా వేసిన దేశ ప్రధాని... ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు అన్ని పార్టీలకు సమయం సరిపోతుందని చెప్పారు. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనావైరస్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. గత 102 రోజులుగా ఒక్క కేసు కూడా న్యూజిలాండ్లో నమోదు కాలేదు. అయితే ఆక్లాండ్లో కేసులు బయటపడటంతో ఎన్నికలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఆలోచన చేసి వాయిదా నిర్ణయం తీసుకుంది.
ఇక ఎన్నికలను వాయిదా వేయాలని న్యూజిలాండ్ డిప్యూటీ ప్రధాని విన్స్టన్ పీటర్స్ కూడా సూచించడంతో జెసిండా అందుకు ఓకే తెలిపారు.ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రధాని దృష్టికి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే వారు తమ ప్రచారానికి బ్రేక్ వేశారు. కరోనావైరస్ కారణంగా పలుచోట్లు ఆంక్షలు విధించడంతో ప్రచారం నిర్వహించలేక ఆపివేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా జెసిండా మలుచుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉంటే గవర్నర్ జనరల్కు జెసిండా ఓ లేఖ రాస్తూ కొత్త ఎన్నికల తేదీని అందులో ప్రస్తావించారు. ఇక అక్టోబర్ 17వ తేదీనే ఎన్నికలకు ఫైనల్ డేట్గా ఖరారు చేసినట్లు చెప్పారు. అదే తేదీన ఎన్నికలు నిర్వహించడం జరగుతుందని గవర్నర్ జనరల్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అంతా ఒకే నావలో పయనిస్తున్నామని అందరికీ అదే వాతావరణం ఉందని జెసిండా చెప్పారు. నవంబర్ 21వ తేదీ లోపు ఎన్నికలు ముగియాల్సి ఉంది.