24 గంటల్లో మళ్లీ ఆ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశం
ఆక్లాండ్: రెండు రోజుల క్రితం న్యూజిలాండ్లోని వైట్ ఐలండ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయితే అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ దీవిని కప్పేయడంతో అక్కడ సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. ఆ దీవి పర్యాటక ప్రాంతం కావడంతో చాలామంది ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటల సమయంలోనే ఇది జరుగుతుందని చెప్పారు. దీంతో సహాయక చర్యల కొనసాగింపునకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సోమవారం న్యూజిలాండ్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో ఈ దీవి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుకుంది. ఇదిలా ఉంటే బుధవారం రోజున మళ్లీ అగ్నిపర్వతంలో కొన్ని కుదుపులను తాము గమనించినట్లు జియోనెట్ అధికారులు తెలిపారు. సోమవారం ఎలా అయితే విస్ఫోటనం చెందిందో అదే స్థాయిలో మరో 24 గంటల్లో అగ్నిపర్వతం పేలే అవకాశం ఉందని చెప్పారు. అయితే సోమవారం జరిగిన పేలుడుతో దట్టంగా పేరుకుపోయిన పొగ కాస్త క్లియర్ కావడంతో బుధవారం ఉదయం సహాయకచర్యలు చేపట్టాలని భావించినట్లు అధికారులు చెప్పారు. అయితే మళ్లీ విస్ఫోటనం చెందే అవకాశం ఉన్నందున సహాయకచర్యలకు అడ్డంకిగా మారిందని సివిల్ డిఫెన్స్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ సారా స్టువార్ట్ చెప్పారు.
ఇక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు దీవిపై 47 మంది పర్యాటకులు చిక్కుకుని ఉన్నారు. ఇక వారిని కాపాడి చికిత్సకు తీసుకువెళుతున్న సమయంలో ఆరు మంది మృతి చెందారు. మరో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. అగ్ని పర్వతం పేలడంతో అదే సమయానికి దీవిపై ఉన్న పర్యాటకుల శరీరం కాలిపోవడంతో పాటు ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికే దీవి మొత్తం బూడిదతో నిండిపోయి ఉంది. మరోసారి విస్ఫోటనం చెందితే ఇక పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఐదు ప్రమాదస్థాయి హెచ్చరికలు ఉండగా.. అందులో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.
ఒకవేళ మరోసారి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందితే దీవి దగ్గరకు అధికారులు చేరుకోలేరు. అంతేకాదు ఒకవేళ దీవిలో ఉన్న వారు మృతి చెందారని అనుకుంటే వారి మృతదేహాలను బయటకు తీసుకురావడం కష్టతరం అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ వర్షం కురిస్తే అక్కడ పేరుకుపోయిన బూడిద గట్టిపడి మరో నేల పొర ఏర్పడే అవకాశం ఉందని స్కాట్ చెప్పారు. ఇదిలా ఉంటే వైట్ ఐలాండ్ దగ్గర ఉన్న వారిని బయటకు తీసుకురావడం తక్షణ కర్తవ్యం అని పోలీసులు చెప్పారు. ఇక దీవి పైకి వెళ్లేందుకు సరైన సమయం లేదా సురక్షిత సమయం ఎప్పుడనే విషయమై శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ పరిస్థితుల్లో అక్కడకు వెళితే కనక ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.