అయ్యో..పాపం:110 మంది రైతుల గొంతు కోసి హత్య చేసిన ఉగ్రవాదులు..
నైజీరియా: నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. అన్నం పెట్టే రైతన్నలను కర్కషంగా గొంతు కోసి హత్యచేసింది బోకో హరాం జీహాది ఉగ్రవాద సంస్థ. ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 110 మంది రైతుల ప్రాణాలను ఈ ఉగ్రవాదులు తీశారు. ఈ ఘటన ఈశాన్య నైజీరియా ప్రాంతంలో చోటు చేసుకుంది. వరి పొలాల్లో ఈ రైతులు పనిచేస్తుండగా వీరిపై బోకోహరాం ఉగ్రవాదులు దాడి చేశారు. 110 మందిని చంపేశారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ కోఆర్డినేటర్ ఎడ్వర్డ్ కల్లాన్ చెప్పారు.ముందుగా 43 మంది అని భావించారు. కానీ ఆ సంఖ్య క్రమంగా పెరిగింది.
పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులపై...
ఈ ఏడాదిలో జరిగిన అత్యంత పాశవికమైన ఘటన ఇదని కల్లాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకపు పౌరులను హత్యచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్యకు పాల్పడిన దుర్మార్గులను పట్టుకుని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మైదుగురి అనే నగరంకు సమీపంలో ఉన్న కోషోబే ప్రాంతంలో ఉన్న పంటపొలాల్లో పనిచేస్తున్న రైతులను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆదివారం జరిగిన రైతుల అంత్యక్రియలకు బోర్నో రాష్ట్ర గవర్నర్ బాబాగాన ఉమారా జులుం హాజరయ్యారు.ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలు మాత్రమే లభించాయని అధికారులు తెలిపారు. మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపిన అధికారులు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
మరో రాష్ట్రం నుంచి పనుల కోసం...
పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులను ముందుగా పట్టుకుని వారిని కట్టేసి అత్యంత దారుణంగా గొంతు కోసి జీహాదీలు చంపేశారని అధికారులు తెలిపారు.వీరంతా మరో రాష్ట్రం నుంచి పనికోసం వచ్చినవారని తెలిపారు.శనివారం నాటికి ఆరుగురు తీవ్రగాయాలతో కనిపించగా మరో 8 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇక చాలామంది మహిళలను కిడ్నాప్ చేసినట్లు కల్లాన్ చెప్పారు. వారిని వెంటనే సురక్షితంగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video
ఘటనను ఖండించిన అధ్యక్షుడు బుహారి
ఇదిలా ఉంటే నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారి ఘటనను ఖండించారు.ఇలాంటి అరాచక తీరుతో యావత్ దేశమంతా బాధపడుతోందని తన సందేశంలో పేర్కొన్నారు.బోర్నో రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొందరు వెళ్లారు. ఇక్కడ బోకో హరాం ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా జరుగుతుండటంతో ఈ ఎన్నికలు తరుచూ వాయిదాపడుతూ వస్తున్నాయి. ఇక్కడ కొంతకాలంగా ఐఎస్డబ్ల్యూఏపీ, బోకోహరాం వర్గాల మధ్య ఫ్యాక్షన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమాయకులపై దాడులు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ నిసిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి ఇన్ఫార్మర్లుగా మారారన్న అనుమానం రావడంతో ఎప్పటికప్పుడు దాడులు చేసి అమాయకపు ప్రజలను హత్యచేస్తున్నారు.