ఆత్మాహుతి దాడి: పదేళ్ల పాపకి బాంబులు చుట్టారు
అబుజ: బోకో హరామ్ ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను నైజీరియా సైన్యం అరెస్ట్ చేసినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కారులో వెళ్తున్న వారు తమ వెంట ఓ పదేళ్ల బాలికను తీసుకెళ్తాన్నురాని, ఆ బాలిక శరీరం చుట్టూ భారీ పేలుడు పదార్థాలు బెల్ట్ పెట్టి చుట్టారని నైజీరియా అధికారులు తెలిపారు.
చిన్నారిని అడ్డు పెట్టుకుని తమ పని చేసుకోవడానికి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దర్నీ అరెస్ట్ చేశామని తెలిపారు. బాలికను పేలుడు పదార్థాల నుంచి విముక్తురాలిని చేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దీనిపై ప్రభుత్వ అధికార ప్రతినిధి మైక్ ఒమరియా మాట్లాడుతూ.. పదేళ్ల హడిజకు పేలుడు పదార్థాలను చుట్టి తమను తాము రక్షించుకునేందుకు, తమ పనిని పూర్తి చేసేందుకు ఉగ్రవాదులు ఇలియా, జైనబ్లు నిర్ణయించారని తెలిపారు. అయితే నైజీరియా అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ నిర్వహించడంతో ఆ బాలిక విముక్తురాలైందని చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పశ్చిమ నైజీరియాలోని కానో ప్రాంతంలో వారం రోజులుగా ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులకు ఎక్కువగా మహిళలను, చిన్నారులను ఉపయోగించుకుంటున్నారు. బుధవారం ఈ ప్రాంతంలో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 8మంది తీవ్ర గాయాలపాలయ్యారు.