ఘోరం: నైజీరియాలో ఆత్మాహుతి దాడి.. 50మంది మృతి
మంగళవారం ఉదయం ఈశాన్య అదమవాలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ టీనేజర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
అబుజా: ఆత్మాహతి దాడితో నైజీరియా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం ఈశాన్య అదమవాలోని మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ టీనేజర్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో దాదాపు 50మంది దాకా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో జనం తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పేలుడు పదార్థాలతో మసీదులోకి వచ్చిన యువకుడు తనకు తాను పేల్చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
నైజీరియన్ ఉగ్రవాద సంస్థ బొకోహారమ్ ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో టీనేజర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న బొకోహారమ్ వారిని ఉపయోగించుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరిస్తోంది.
ఆత్మాహుతి దాడి ఎవరి పనై ఉంటుందని పోలీస్ అధికారి అబూబకర్ ను మీడియా ప్రశ్నించగా.. 'ఇది ఎవరి పనో మనకందరికీ తెలుసు. ఎవరినో ప్రత్యేకంగా అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ దీని వెనుకాల ఎవరున్నారన్నది మనకి తెలిసిన విషయమే' అంటూ బదులిచ్చారు.