ఉగ్రవాదులపై మెరుపుదాడి: 61 మంది క్షేమం
అబుజా: బొకోహారమ్ ఉగ్రవాదులను ఉరికించిన నైజీరియా సైనం వారి చెరలో బందీలుగా ఉన్న 61 మందిని క్షేమంగా రక్షించారు. ఇదే సమయంలో నలుగురు బొకోహారమ్ ఉగ్రవాదులను అంతం చేశామని నైజీరియా సైనిక అధికారులు తెలిపారు.
బొకోహారమ్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి అయిన వారిలో ఎక్కువ మంది చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. మొదట బొకోహారమ్ జీహాదిస్టులు ఉన్న ప్రాంతాలను నైజీరియా సైన్యం గుర్తించింది.
తరువాత యుద్ద విమానాల సహాయంతో బొకోహారమ్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలలో సైన్యం దిగింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న వారికి ఎలాంటి హాని జరకుండా జాగ్రత్త పడిన సైన్యం కాల్పులు జరిపింది.
ఉగ్రవాదులను అక్కడి నుంచి ఉరికించారు. తరువాత చెరలో ఉన్న వారిని క్షేమంగా రక్షించి యుద్ద విమానాలలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే సమయంలో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారని, మిగిలిన వారు పారిపోయారని అధికారులు తెలిపారు.
గత కొంత కాలంగా బొకోహారమ్ ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి నైజీరియా ప్రభుత్వం శక్తివంచన లేకుండ పని చేస్తున్నది. గత అక్టోబర్ 28వ తేదిన ఉగ్రవాదుల చెరలో ఉన్న 330 మంది బందీలను క్షేమంగా రక్షించారు. బొకోహారమ్ ఉగ్రవాదులు ఎక్కువగా మహిళలు, చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.