కేసు పెట్టగానే కోట్లు తరలించాడు వెలుగులోకి వస్తున్న నీరవ్ లీలలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు పంగనామం పెట్టి ప్రస్తుతం బ్రిటన్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భారత్లో దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించిన వెంటనే నీరవ్ పక్కా ప్లాన్తో పెట్టాబేడా సర్ధుకున్నాడట. కేసు నమోదైన తర్వాత కూడా ఆయన భారీ మొత్తంలో నగదు, వజ్రాలు, బంగారాన్ని విదేశాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఆస్తులు అటాచ్ చేసే సూచనలు ఉండటంతో వాటిని స్విస్ బ్యాంకుల్లో దాచినట్లు తెలుస్తోంది.
నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్
స్విస్ బ్యాంకుల్లో నగదు
భారత్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా గుర్తించిన నీరవ్ మోడీ పీఎన్బీ స్కాంలో దర్యాప్తు మొదలైన వెంటనే అప్రమత్తమ్యాడు. కేసు బుక్కైన కొన్ని నెలల తర్వాత దాదాపు 89 కోట్లు సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్కు తరలించాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ మొత్తంతో పాటు నీరవ్ తన సన్నిహితుల ద్వారా రూ. 66కోట్ల విలువైన వజ్రాలు, రూ.6.5 కోట్ల నగదు, 150 బాక్సుల్లో ముత్యాలు, 50కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి హాంకాంగ్కు పంపినట్లు తెలుస్తోంది. తన సోదరి పూర్వీ మోడీకి చెందిన బెల్వడేర్ హోల్డింగ్స్ గ్రూప్ లిమిటెడ్ ద్వారా ఈఎఫ్జీ బ్యాంక్ ఖాతాలో రెండు విడతల్లో ఈ మొత్తం జమ చేశాడు.
పరారీలో నీరవ్ అనుచరుడు
ఇదిలా ఉంటే నీరవ్ మోడీ ఆర్థిక అవకతవకల్లో భాగస్వామైన కంపెనీ ఉద్యోగి సుభాష్ పరాబ్ కోసం దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. ఇతని ద్వారానే నీరవ్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.8200 కోట్ల విలువైన ఫేక్ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సుభాష్ పరాబ్పై కుట్ర, నమ్మకద్రోహం, చీటింగ్ కేసులు నమోదుకావడంతో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 2011 నుంచి 2018 మధ్యలో నీరవ్ కంపెనీ 24వేల కోట్ల విలువైన నకిలీ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్స్తో బ్యాంకుల్ని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
నీరవ్ దగ్గర ఏడు వీసాలు
నీరవ్ మోడీ దగ్గర ఏడు దేశాలకు చెందిన బిజినెస్, రెసిడెన్స్ వీసాలు ఉన్నట్లు సీబీఐ, ఈడీ విచారణలో బయటపడింది. కెనడా, అమెరికా, బ్రిటన్, షెన్జాన్ దేశాలకు చెందిన బిజినెస్ వీసాలు, హాంకాంగ్, దుబాయ్, సింగపూర్లకు చెందిన రెసిడెన్స్ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం యూకే జైలులో ఊచలు లెక్కబెడుతున్న నీరవ్ మోడీని భారత్కు అప్పగించే పిటీషన్పై అక్కడి న్యాయస్థానం ఏప్రిల్ 26న విచారణ జరపనుంది.