నాలుగోసారి: నీరవ్ మోడీ బెయిల్ మంజూరుకు నిరాకరించిన యూకే హైకోర్టు
ప్రముఖ వజ్రాల వ్యాపారి ఆర్థిక నేరగాడు అయిన నీరవ్ మోడీకి కష్టాలు తప్పడం లేదు. బెయిల్ కోసం తాను యూకేలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మళ్లీ ఆయనకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం ఇది వరుసగా నాల్గవసారి. బెయిల్పై బయటకొస్తే నీరవ్ మోడీ సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని కోర్టు బలంగా నమ్మడంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
నీరవ్ మోడీ ఆయన తరపున వ్యక్తులు సాక్షులను ప్రభావితం చేస్తారని ఇందుకు రుజువులు కూడా ఉన్నందున నీరవ్ మోడీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొన్ని వేల కోట్లు రుణం తీసుకుని ఎగవేసి లండన్కు పారిపోయాడు . ఇక లండన్ నుంచి భారత్కు రప్పించేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత అధికారులు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో లండన్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్టు చేశారు.
మోడీ అరెస్టు అయినప్పటి నుంచి ఆయన లాయర్లు వెస్ట్మినిస్టర్ కోర్టులో మూడు సార్లు బెయిల్ కోసం దాఖలు చేశారు. అయితే మూడుసార్లు ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా వెస్ట్మినిస్టర్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూకే హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా అదే ఫలితం వచ్చింది. భారత ప్రభుత్వం చెబుతున్నట్లుగా తన క్లయింట్ నీరవ్ మోడీ దేశం విడిచి వెళ్లరని హైకోర్టులో వాదించినప్పటికీ కోర్టు విశ్వసించలేదు. నీరవ్ మోడీ వికీలీక్స్ జూలియన్ అసాంజేలా ఈక్వేడర్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తి కాదని.. ఆయన సాధారణ భారతీయ నగల వ్యాపారి అని కోర్టుకు తెలిపారు నీరవ్ మోడీ లాయర్లు. తాను దేశం దాటి పారిపోతారని చెప్పేందుకు బలమైన ఆధారాలు భారత ప్రభుత్వం చూపించలేకపోతోందని లాయర్ జడ్జిముందు తన వాదనలు వినిపించారు.
మార్చిలో అరెస్టు అయిన నీరవ్ మోడీ... ఇప్పటికే వెస్ట్మినిస్టర్ కోర్టులో మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి భంగపడ్డాడు. తాజాగా హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన పరిస్థితి జైలుకే అంకితమైంది.