పీఎన్బీ స్కామ్, బావ అలా చేస్తాడని ఊహించలేదు: మయాంక్ మెహతా
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో డైమండ్ కింగ్ రూ.13,600 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ఉదంతంపై అతని బంధువులు కొడుతున్న 'ఛీ' కొడుతున్న పరిస్థితి. నీరవ్ మోడీ కేసుకు సంబంధించి వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా.. కుంభకోణంపై స్పందించడానికి వారు ఆసక్తి చూపించడం లేదు.
Recommended Video
హాంగ్కాంగ్లో నీరవ్ మోడీ: అరెస్టుపై భారత్కు తేల్చేసిన చైనా
ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా చానెల్ నీరవ్ మోడీ బావ అయిన మయాంక్ మెహతాను సంప్రదించే ప్రయత్నం చేసింది. నీరవ్ హాంకాంగ్ లోని తన సోదరి భర్త పూర్వి మెహతా ఇంట్లో తలదాచుకున్నట్టు వార్తలు రావడంతో.. సదరు మీడియా అక్కడికి వెళ్లింది.
ఎస్టోరియల్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్ లోని మయాంక్ మెహతా ఇంటి తలుపు తట్టగా ఆ మీడియాకు నిరాశే ఎదురైంది. ఇక్కడ నీరవ్ లేదా పూర్వి పేరుతో ఎవరూ లేరంటూ ముఖం పైనే తలుపేశారు. అయితే ఇదే కాంప్లెక్స్ లో స్టాఫ్గా పనిచేస్తున్న ఒక మహిళ.. తనకు పూర్వి సోదరుడు నీరవ్ మోడీ తెలుసని చెప్పారు.
ఇటీవలి కాలంలో తాను ఇక్కడ కనిపించలేదని ఆమె చెప్పారు. అనంతరం ఎలాగోలా మయాంక్ మెహతాతో ఆ మీడియా మాట్లాడగలిగింది. తన బావ మోడీ ఇలా చేస్తారని అసలు ఊహించలేదని, ఈ సంఘటను తమను షాక్కి, ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.
అసలు సమస్య ఏంటా అన్న దాన్ని చేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. మోడీపై తమ పిల్లలు సైతం ప్రశ్నలు అడుగుతున్నారని.. అంకుల్ ఎందుకు గూగుల్లో కనిపిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారని వాపోయారు. అయితే నిజాలను పక్కనపెట్టడానికి లేదని, ఇకపై మోడీతో తాము ఎలాంటి సంబంధాలు పెట్టుకోమని తేల్చి చెప్పారు.
నీరవ్ సోదరి, తన భార్య పూర్వి ప్రస్తుతం ట్రావెలింగ్లో ఉందని తెలిపారు. అయితే కాంప్లెక్స్ స్టాఫ్ మాత్రం ఆమె ఫ్లాట్లోనే ఉన్నట్టు చెప్పడం గమనార్హం. తమ ఇంట్లో నీరవ్ మోడీ తలదాచుకున్నారన్న అనుమానాలపై కూడా ఆయన స్పందించారు. అవసరమైతే భారత ప్రభుత్వం మా ఇంట్లో సోదాలు చేయవచ్చని తెలిపారు.
కాగా, నీరవ్ మోడీ హాంకాంగ్ లోనే ఉన్నట్టు ఇటీవల కేంద్రం ప్రభుత్వం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. మోడీ అరెస్టుకు సంబంధించి చైనా అధికారులతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. భారత్ విజ్ఞప్తి మేరకు ప్రొవిజనల్ అరెస్టుపై హాంకాంగ్ అథారిటీలు ఆలోచిస్తున్నాయి.