మరో పాపం: లక్షా20వేల డాలర్ల ఫేక్ రింగ్స్తో ప్రేమజంటను విడదీసిన నీరవ్ మోడీ!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. నిశ్చితార్థానికి సిద్ధమైన ఓ ప్రేమజంటను విడదీశాడు. తన గర్ల్ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం డైమండ్ రింగ్లను ఆర్డర్ చేసిన కెనడా పౌరుడికి.. నకిలీవి అంటగట్టాడు.
అయితే, అవి నకిలీవని తెలియడంతో ఆమె ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు ఆ కెనడా వాసి. దీంతో నష్టపరిహారం చెల్లించాలంటూ అతడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో నీరవ్ మోడీపై కేసు నమోదైంది.
నీరవ్ మోడీతో పరిచయం
నీరవ్ మోడీ నకిలీ వజ్రాల మోసం వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన అల్ఫోన్సో అనే వ్యక్తి 2012లో ఓ ఈవెంట్లో నీరవ్ మోడీని కలిశాడు. ఆ తర్వాత ఇద్దరికి మంచి బంధం ఏర్పడింది. అల్ఫోన్సో పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్. అల్ఫోన్సో తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలికి డైమండ్ రింగ్ ఇచ్చి, ప్రపోజ్ చేసి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు.
ప్రియురాలికి ఖరీదైన రింగ్ కోసం..
కాగా, ప్రేమలో ఉన్న చాలా కాలం తర్వాత, 2018 ఏప్రిల్లో లక్ష డాలర్ల బడ్జెట్లో ‘స్పెషల్ ఎంగేజ్మెంట్ రింగ్' పంపించాలని నీరవ్ మోడీకి ఈమెయిల్ చేశాడు. కానీ అప్పటికే నీరవ్ మోడీ-పీఎన్బీ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కానీ, ఈ వ్యక్తికి ఈ స్కాం గురించి తెలియలేదు. ఇదే అదునుగా చూసుకుని, నీరవ్ మోడీ ‘పర్ఫెక్ట్' 3.2 క్యారెట్ గుండ్రటి కట్ డైమండ్ రింగ్ను అల్ఫోన్సోకు పంపించాడు. హై-క్వాలిటీ గ్రేడ్, కలర్లెస్ స్టోన్తో ఉన్న దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు.
రెండు రింగ్స్ పంపడంతో ఆనందం..
కాగా, నీరవ్ మోడీ తనకు కావాల్సిన రింగ్ పంపడంతో సంతృప్తి చెందిన అల్ఫోన్సో వెంటనే కృతజ్ఞతలతో మెసేజ్ పంపాడు. కానీ, తన గర్ల్ఫ్రెండ్ మరో డిజైన్ కోరుకోవడంతో, మరో డైమాండ్ రింగ్ను కూడా 80వేల డాలర్లకు నీరవ్ నుంచే తెప్పించుకున్నాడు. ఈ రింగ్లను మోడీ అసిస్టెంట్ అరీ, అల్ఫోన్సోకు అందించాడు. ఆ డైమండ్ రింగ్ల నగదును నీరవ్ హాంకాంగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అల్ఫోన్సో.
అల్ఫోన్సోకు ఒకే చెప్పిన ప్రియురాలు.. కానీ..
అయితే, ఆ తర్వాత డైమండ్ రింగ్ల ఇన్వాయిస్, అధికారి సర్టిఫికేట్లను పంపించమని అల్ఫోన్సో ఎన్నిసార్లు అడిగినా నీరవ్ మోడీ పంపించలేదు. నీరవ్ పంపించిన రెండు రింగ్లతో గర్ల్ఫ్రెండ్కు ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది కూడా. కానీ రింగ్ల సర్టిఫికేట్లు లేకపోతే, ప్రమాదంలో పడతామని అనుకున్న, అదే విషయంపై చాలా సార్లు మోదీకి ఈమెయిల్స్ పంపారు. సర్టిఫికేట్లు వస్తున్నాయంటూ నీరవ్ నమ్మబలికాడు. కానీ ఎంతకీ అవి రాలేదు. అల్ఫోన్సో ప్రియురాలు ఈ రింగ్లను తీసుకెళ్లి డైమండ్ విలువను లెక్కగట్టే వారికి చూపించింది. వారు అవి నకిలీ డైమండ్స్ అని తేల్చేశారు.
4.2 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ.. నీరవ్ మోడీకి ఘాటుగా..
ఈ విషయం ప్రియురాలు.. అల్ఫోన్సోకు చెప్పడంతో.. అలా జరగదని, వాటి కోసం రెండు లక్షల డాలర్లు ఖర్చు చేశానని, ఇవి నీరవ్ పంపించాడంటూ చెప్పుకొచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన అల్ఫోన్సో ప్రియురాలు అతనికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో మానిసకంగా కుంగిపోయిన అల్ఫోన్సో మోడీకి కోపంతో మరో ఈమెయిల్ చేశాడు. ‘నాకు ఎలాంటి బాధను ఇచ్చావో నీకేమైనా తెలుస్తుందా? నా ప్రియురాలు ఇప్పుడు మాజీ ప్రియురాలు అయింది. మా అద్భుతమైన జీవితాన్ని నాశనం చేశావు' అంటూ పేర్కొన్నాడు. అంతేగాక, ఇదే విషయంపై అల్ఫోన్సో.. నీరవ్ మోడీకి వ్యతిరేకంగా సివిల్ దావా వేశాడు. 4.2 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ కేసు విచారణకు రానుంది. ఇప్పటికే మనదేశంలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ.. ఇప్పుడు ఈ ప్రేమజంటను విడదీసి మరోపాపం మూటకట్టుకున్నట్లయింది.