పాకిస్తాన్లో మళ్లీ రేగిన ‘భగత్ సింగ్’ మంటలు!
Recommended Video
లాహోర్: స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారిపై పోరాడిన సర్దార్ భగత్ సింగ్ను పాకిస్తాన్లోని అత్యున్నత గ్యాలంటరీ అవార్డు అయిన 'నిషాన్ ఏ హైదర్'తో సత్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఆయనను 86 ఏళ్ల కింద ఉరి తీసిన లాహోర్లోని షాదమన్ చౌక్లో భగత్సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తోంది. ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ.. భగత్ సింగ్ ఒక యూత్ ఐకాన్ అని, నేటి యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అని వ్యాఖ్యానించారు.
‘నిషాన్ ఏ హైదర్’తో సత్కరించాలి...
‘సర్దార్ భగత్ సింగ్.. నిజమైన స్వతంత్ర యోధుడు. చిన్నతనంలోనే బ్రిటీష్ వారితో భగత్ చేసిన పోరాటం అసామాన్యం..' అని భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ కొనియాడారు. భగత్ సింగ్ను పాకిస్తాన్ అత్యున్నత గ్యాలంటరీ మెడల్ ‘నిషాన్ ఏ హైదర్'తో సత్కరించాలని ఖురేషీ డిమాండ్ చేశారు.
పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి లేఖ...
స్వాతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని, ఆత్మత్యాగాన్ని అందరం గుర్తించాలని భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ తాజాగా మరోసారి పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సైతం భగత్ సింగ్ త్యాగానికి నివాళి అర్పించాలన్న వ్యాఖ్యలను కూడా తన లేఖలో పొందుపరిచారు.
‘నిషాన్ ఏ హైదర్’ అంటే?
పాకిస్తాన్ సైన్యంలో అత్యంత ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే ‘నిషాన్ ఏ హైదర్'. ఈ పదానికి ‘సింహబలుడు' అని అర్థం. నాటి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భగత్ సింగ్ను, ఆయన మిత్రులైన సుఖ్దేవ్, రాజ్ గురులను 1931 మార్చి 23న లాహోర్లో ఉరితీసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రభుత్వం భగత్ సింగ్కు ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటూ కొంతకాలంగా డిమాండ్ ఉంది.
హఫీజ్ సయీద్ తీవ్ర అభ్యంతరం...
అయితే సర్దార్ భగత్ సింగ్కు అత్యున్న సైనిక పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్పై ముంబై దాడుల సూత్రధారి, జమాతే-ఉద్-దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాక షాదమన్ చౌక్ పేరు మార్పుపైనా వ్యతిరేకత ప్రకటించారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్ పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తాయని హఫీజ్ సయీద్ పేర్కొన్నారు.