పుల్వామా జైష్ పనే, మసూద్ నన్నూ చంపాలనుకున్నాడు కానీ ఇమ్రాన్ ఖాన్కు సంబంధంలేదు: ముషారఫ్
దుబాయ్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ముషారఫ్ బుధవారం స్పందించాడు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పుల్వామా ఘటనకు కచ్చితంగా జైష్ ఏ మొహమ్మద్ పనేనని చెప్పారు. ఈ సంస్థ చీఫ్ మసూద్ అజహర్ పైన ఏమాత్రం జాలిచూపవద్దని చెప్పారు. మసూద్ తనను కూడా చంపేందుకు ప్రయత్నాలు చేశాడని తెలిపారు. జైష్ ఏ మొహమ్మద్ సంస్థను పాకిస్తాన్ ఏమాత్రం ఉపేక్షించవద్దని ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు హితవు పలికారు.
ఈ ఉగ్రవాద సంస్థ పైన పాక్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ముషారఫ్ సూచించాడు. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాత్ర మాత్రం లేదని ముషారఫ్ చెప్పాడు. తద్వారా ఇమ్రాన్ ఖాన్ను వెనుకేసుకొచ్చారు. ఇమ్రాన్పై భారత్ ఆరోపణలు సరికాదని చెప్పారు. జైష్ ఏ మొహమ్మద్ చేసిన పనిని పాకిస్తాన్ ప్రభుత్వానికి అంటగట్టవద్దని భారత్ను కోరాడు. ఆ మచ్చ వేయవద్దన్నారు.
అదే సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ముషారఫ్ విమర్శలు గుప్పించారు. భారత్కు చెందిన నలభై మందికి పైగా జవాన్లు చనిపోవడంపై మోడీలో ఎలాంటి నిజమైన ఎమోషన్ లేదని వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి బాధాకరం అన్నాడు. ఇందులో జైష్ ఏ మొహమ్మద్ పాత్ర ఉంటుందని, ఆ ఉగ్రవాద సంస్థ విషయంలో తనకు ఎలాంటి సానుభూతి లేదని చెప్పారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థపై సానుభూతితో ఉండరని తాను భావిస్తున్నానని ముషారఫ్ చెప్పాడు. ప్రతి విషయంలో (తీవ్రవాద దాడులు) పాకిస్తాన్ను భారత్ తప్పుగా చూపిస్తోందన్నారు. పాకిస్తాన్ పైన బురదజల్లడం మానుకోవాలన్నారు. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో కలిసి పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సర్జికల్ స్ట్రయిక్స్ పైన కూడా ఆయన స్పందించారు.