కశ్మీర్ అంశంపై చర్యలు తీసుకోకుంటే ఇక యుద్ధమే శరణ్యం: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోజురోజుకూ బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్పై చర్యలు తీసుకోకుంటే తమ మిలటరీ రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్లో కశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఖాన్ ఓ కథనాన్ని రాశారు. అంతర్జాతాయ సమాజం కశ్మీర్ అంశాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
రెండు అణుదేశాల మధ్య యుద్ధం తప్పదు
కశ్మీర్ అంశంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకుంటే రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు యుద్ధానికి దిగుతాయంటూ హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్న నాటి నుంచే ఇమ్రాన్ ఖాన్ భారత్పై తీవ్ర విమర్శలు చేస్తుండటం విశేషం. దీంతో భారత్ - పాకిస్తాన్ల మధ్య ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. భారత ఆక్రమిత కశ్మీర్లో మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఆ తర్వాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని పాక్ జీర్ణించుకోలేకుంది. భారత రాజ్యాంగాన్ని మోడీ సర్కార్ తుంగలోకి తొక్కేసిందంటూ విమర్శించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ పై ఐక్యరాజ్య భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించిందని, అదే సమయంలో షిమ్లా ఒప్పందాన్ని కూడా పక్కనపెట్టిందంటూ ఆరోపించారు.
కశ్మీరీల స్వతంత్రతకు సంకెళ్లు వేశారు
ఇక జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అక్కడ సమాచార వ్యవస్థ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే పరిస్థితి చక్కబడుతుండటంతో ఏ క్షణమైనా ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉందని అక్కడి భద్రతా బలగాలు చెబుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వీడియోలను అక్కడి నాగా తిరుగుబాటు దారులకు చూపించి ప్రభుత్వంపై తిరుగబాటు చేయాలంటూ ఉసిగొల్పుతోంది. మోడీ సర్కార్ నవభారత నిర్మాణం గురించి మాట్లాడుతూనే ఆంక్షలు విధించడం సరికాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్లో ప్రజల స్వాతంత్య్రానికి సంకెళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు కర్ఫ్యూ ఎత్తివేస్తే అక్కడ రక్తం ఏరులై పారుతుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు కర్ఫ్యూకు నిరసన తెలుపుతున్న కశ్మీరీలను భారత బలగాలు కాల్చి చంపేస్తున్నాయని అన్నారు ఇమ్రాన్.
భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల్లో కశ్మీరీలను భాగస్వామ్యం చేయాలి
భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలకు మార్గం సుగుమం అయితే చర్చలో కశ్మీరీ ప్రజలు కూడా పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ఖాన్ తన కథనంలో రాశారు. ఇక చర్చలు జరిపేందుకు భారత్ ముందుకు రావాలని చెప్పిన ఇమ్రాన్ ఖాన్... వ్యూహాత్మక అంశాలు, వాణిజ్యంపై కూడా చర్చలు జరగాలని చెప్పారు. మాట్లాడిన ప్రతి సారీ అణ్వాయుధాల ప్రస్తావన తీసుకొస్తూ దక్షిణాసియాలో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తోందని భారత్ మండిపడింది. పాకిస్తాన్ తన వైపు నుంచి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తోందని అయితే అంతర్జాతీయ సమాజం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని భారత విదేశాంగా శాఖ స్పష్టం చేసింది.