మోడీ, ట్రంప్ పిలుపుల్లో భేదాల్లేవ్! బంధం దృఢమే: ఇవాంకా ట్రంప్
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎప్పుడూ దృఢంగానే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ అన్నారు.
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎప్పుడూ దృఢంగానే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ అన్నారు. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు-2017 రెండు దేశాల మధ్య 'దృఢమైన స్నేహబంధం'కు నిదర్శనమని ఇవాంకా ట్రంప్ స్పష్టం చేశారు.
Recommended Video
ప్రపంచ 'ప్రత్యేక' విందుకు 'ఫలక్నుమా' రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాక
నాయకురాలి హోదాలో..
హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఆమె మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో 28 నుంచి 30 వరకు నిర్వహించే ఈ సదస్సుకు అమెరికా వాణిజ్య బృందం నాయకురాలి హోదాలో ఇవాంకా ముఖ్య అతిథిగా వస్తున్నారు. వాషింగ్టన్లో థ్యాంక్స్ గివింగ్ వేడుక అనంతరం ఇవాంకా ట్రంప్ ఈ సదస్సు గురించి మాట్లాడారు.
బంధం దృఢమే..
ఇది భారత్, అమెరికా మధ్య దృఢమైన స్నేహబంధానికి చిహ్నంగా పేర్కొన్నారు. తొలిసారి ‘మహిళలు ముందు.. అందరికీ శ్రేయస్సు' అన్న థీమ్తో సదస్సు నిర్వహిస్తుండటం మహిళల ఆర్థిక సాధికారతను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. తన పర్యటన విజయవంతం అవుతుందని తెలిపారు.
మోడీ, ట్రంప్ పిలుపుల్లో భేదాల్లేవ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అమెరికా ఫస్ట్.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘మేకిన్ ఇండియా'ల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని అన్నారు. ఇవి రెండూ అభివృద్ధి నినాదాలేనని అన్నారు.
మాకు గొప్ప మిత్ర దేశం..
‘భారత్ మాకు గొప్ప మిత్రదేశం. భాగస్వామి. భద్రత, ఆర్థిక రంగాల్లో మెరుగవ్వడం మా భాగస్వామ్య ప్రధాన లక్ష్యం' అని ఇవాంకా అన్నారు. ‘ది ప్లీనరీ సెషన్: మార్పు.. మహిళల వ్యాపార నాయకత్వం', ‘బ్రేకౌట్ సెషన్: మానవ వనరుల అభివృద్ధిలో సృజన, నైపుణ్య శిక్షణ మనమూ చేయగలం' అనే రెండు ప్యానళ్లలో ఇవాంకా పాల్గొంటారు. 170దేశాల నుంచి 1500మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సదస్సును ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.