వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. వెంటనే ఆ ప్రచారం ఆపేయండి: భారత్కు చైనా హెచ్చరిక!
రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: భారత్-చైనా డోక్లామ్ సరిహద్దు వివాదం రగులుతూనే ఉంది. ఈ విషయంలో రాజీ దిశగా చైనా ఆలోచిస్తుందన్న ప్రచారం వట్టిదేనని ఆ దేశ అంతర్జాతీయ సంబంధాల పరిశోధకుడు హు జియాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
డోక్లామ్ విషయంలో తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునేది లేదని, తమ భూభాగం నుంచి తమ సైన్యాన్నే వెనక్కి ఎలా తీసుకుంటామని ప్రశ్నించింది. ఈ సందర్భంగా హు జియాంగ్ భారత్ తో చర్చల గురించి ప్రస్తావించారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లినంత మాత్రానా.. చైనా రాజీకి వస్తుందనుకోవడం సరికాదని అన్నారు.
డోక్లామ్లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా
ఈ అంశాన్ని ఉటంకిస్తూ చైనా రాజీ ధోరణి అంటూ భారత మీడియా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ఊహాగానాలకు తెరదించాలని సూచించారు. 'చైనా నిర్ణయం మారదు.. భారత ప్రభుత్వం, అక్కడి మీడియా మేం రాజీపడుతున్నట్లుగా ఊహాగానాలు కల్పించడం సరికాదు' అని స్పష్టం చేశారు.