ఇది తొలి షరతు, అప్పటి దాకా మాటల్లేవ్: భారత్కు చైనా హెచ్చరిక
డోంగ్లాంగ్ ప్రాంతం నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించే వరకు చర్చల ప్రసక్తే లేదని గురువారం చైనా తేల్చి చెప్పింది.
బీజింగ్: చైనా తనదిగా చెప్పుకుంటున్న డోంగ్లాంగ్ ప్రాంతం నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించే వరకు చర్చల ప్రసక్తే లేదని గురువారం చైనా తేల్చి చెప్పింది.
ఇరు దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాలంటే తొలుత అక్కడి నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని పేర్కొంది.
కైలాశ్ మానస సరోవర్ యాత్రను అడ్డుకున్న చైనా అక్కడ తన దళాలను మోహరించింది. ప్రతిగా భారత్ కూడా దళాలు మోహరించింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి లు కంగ్ మాట్లాడారు. సరిహద్దు నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలని కోరారు. అర్థవంతమైన చర్చలకు ఇది తమ ముందస్తు షరతు అన్నారు.
కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా: మానస సరోవర యాత్రకు బ్రేక్!
కాగా, భూటాన్ ఆర్మీ క్యాంప్ ఉన్న డోంగ్లాంగ్లోని జోంప్లిరి ప్రాంతం వైపుగా చైనా రోడ్డు నిర్మించడాన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భూటాన్ ఆందోళనపై కూడా చైనా విదేశాంగ మంత్రి లు కంగ్ మాట్లాడారు. చైనా భూభాగంపై చట్టబద్ధంగానే నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు.
సిక్కిం సెక్టార్లోని డోంగ్లాంగ్ భూటాన్కు సమీపంలో ఉంది. చైనా, భూటాన్ మధ్య ఇది వివాదాస్పద ప్రాంతం. ఇక్కడ ఓ వైపు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన దళాలను మోహరించగా, మరోవైపు భారత్ కూడా ఆర్మీని మోహరించింది.
అయితే డోంగ్లాంగ్ పురాతన కాలం నుంచి చైనాలో భాగమని లు కంగ్ పేర్కొన్నారు. అది వివాద రహిత ప్రాంతమన్నారు. గురువారం ఉదయం భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అక్కడ సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు.