నిజాలు చెప్తే తొక్కేస్తారు : ‘యూట్యూబ్’ కాల్పుల నిందితురాలి సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: క్యాలిఫోర్నియాలోని శాన్బ్రూనో యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై నిందితురాలిగా అనుమానిస్తున్న మహిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తీవ్ర విషాదం, ఇప్పుడు మీరంతా షాక్లో: ఫైరింగ్పై సుందర్ పిచాయ్ ఈమెయిల్
కాగా, కాల్పులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న నిందిత మహిళను దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన నసీమ్ అగ్దమ్గా గుర్తించారు. వీడియోల విషయంలో యూట్యూబ్పై ఏర్పడిన వ్యతిరేకతే ఘటనకు కారణమని తెలుస్తోంది. తాను పోస్టు చేస్తున్న వీడియోలకు వీక్షణలు రాకుండా యూట్యూబ్ నియంత్రిస్తోందని సదరు మహిళ విమర్శలు చేసినట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి.
యూట్యూమ్ నియంత్రణపై నిందితురాలు
కాగా, కాల్పుల ఘటన అనంతరం ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో దర్యాప్తు నిమిత్తం పోలీసులు నసీమ్ సోషల్మీడియా ఖాతాలను, ఆమెకు చెందిన ఓ వెబ్సైట్ను పరిశీలించారు. నసీమ్కు యూట్యూబ్లో ఓ ఛానల్ ఉంది. దాని ద్వారా జంతువుల హక్కులు, వాటి రక్షణకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుంటుందని తెలిసింది. అయితే ఈ వీడియోలకు వీక్షణలు(వ్యూస్) రాకుండా యూట్యూబ్ నియంత్రిస్తోందని నసీమ్ తన వెబ్సైట్లో పేర్కొన్నట్లు సమాచారం.
స్వేచ్ఛ, సమానత్వం లేదు
‘యూట్యూబ్, ఇతర వీడియో షేరింగ్ సైట్లలో సమాన అవకాశాలు లేకుండా పోయాయి. ఈ ప్రపంచంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాలు చెప్తే తొక్కేస్తారు' అని నజీమ్ తన వెబ్సైట్లో రాసుకున్నట్లు అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతేగాక, తనకు తన కంపెనీ అంటే ఇష్టం లేదని, ఆ కంపెనీపై తనకు చాలా వ్యతిరేకత భావం ఉందని నిందితురాలు తన కుటుంబసభ్యులకు తరచూ చెబుతుండేదని తెలిసింది.
కాల్పులకు కారణం ఆ భావనే
ఈ వ్యతిరేకత భావం వల్లే ఆమె యూట్యూబ్ ఆఫీస్కు వెళ్లి కాల్పులు జరిపి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఘటన జరిగిన కొద్ది సేపటికే యూట్యూబ్ నుంచి నసీమ్ ఛానళ్లను, ఆమె సోషల్మీడియా ఖాతాలను, వెబ్సైట్ను తొలగించారు.
ఫొటో విడుదల చేసిన పోలీసులు
కాగా, కాల్పుల ఘటనలో అనుమానితురాలిగా పేర్కొంటున్న నసీమ్ ఫొటోను శాన్బ్రూనో పోలీసులు విడుదల చేశారు. సదరు జరిపిన కాల్పుల్లో నలుగురు యూట్యూబ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి విచారం వ్యక్తం చేశారు. ఇది బాధాకరమని, ఈ సమయంలో వారికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. కంపెనీ లోపల, బయట ఉన్న వారు అండగా నిలిచారని, అందరికీ కృతజ్ఞతలు అన్నారు.