లఢక్లో మోడీ పర్యటనపై స్పందించిన చైనా: డ్రాగన్ మెత్తబడినట్టే..మెట్టు దిగినట్టే: రాజీ ధోరణితో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లఢక్ పర్యటనపై చైనా స్పందించింది. ప్రధాని ఇంకా లేహ్లో 14 కార్ప్స్ సహా ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని కొనసాగిస్తోన్న సమయంలోనే తన స్పందనను వ్యక్తం చేసింది. కాస్త మెత్తబడినట్టే కనిపిస్తోంది.. మెట్టుదిగినట్టే అనిపిస్తోంది. సుమారు మూడు నెలలుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించడానికి ఏకంగా ప్రధాన మంత్రే రంగంలోకి దిగడాన్ని నిశితంగా పరిశీలించిన చైనా.. ఆ కొద్దిసేపటికే ఓ ప్రకటన విడుదల చేసింది. రాజీ ధోరణికి వచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video
సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను పెంచేలా రెండు దేశాలు కూడా ఎలాంటి కీలక నిర్ణయాలను, క్లిష్టమైన అడుగులను వేయకూడదని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లీజియన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి సైనిక, డిప్లొమేటిక్ పద్ధతులను అనుసరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా ఏ ఒక్క దేశం కూడా కారణం కాకూడదని తాము బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకున్న సంఘటనలు, నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ఝావో లీజియన్ గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత మరింత పెరిగేలా ఏ ఒక్కరు కూడా ఎలాంటి కీలక, సంచలన నిర్ణయాలను తీసుకోలేరని స్పష్టం చేశారు. ఆర్మీ, డిప్లొమేటిక్ ఛానళ్ల ద్వారానే పరిష్కరించుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన లఢక్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ఆయన లేహ్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల అందరి దృష్టీ అటు వైపు మళ్లింది. వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద కిందటి నెల 15వ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, మూడు దఫాలుగా చర్చలు ఫలితాలు రాకపోవడంతో ప్రధాని అనహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు.
చైనాకే కాదు.. లేటెస్ట్గా పాకిస్తాన్కూ కోతల వాత పెట్టిన భారత్: పాక్ తేరుకోలేదిక: రాష్ట్రాలకు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణెలతో కలిసి లేహ్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. లేహ్లో నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతున్న సమయంలోనే చైనా తన స్పందనను వ్యక్తం చేయడం పట్ల ఆసక్తి నెలకొంది. చైనా కొద్దిగా రాజీ ధోరణిని ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. అందుకే- ఉద్రిక్తతలను పెంచేలా ఏ ఒక్కరు కూడా కారణం కాకూడదని వ్యాఖ్యానించినట్లు స్పష్టమౌతోంది.